కోర్టులు, చట్టాలు నేరస్తులకు చుట్టాలు.. న్యాయమెక్కడా? నిర్భయ తల్లి ఆవేదన
తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి సామూహిక అత్యాచారం , హత్య అందర్నీ షాక్ కు గురి చేసింది. తెలంగాణలో మరో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. మరో అమాయకురాలు కామాంధుల పైశాచికత్వం బలైపోయింది. ఊహించని విధంగా నలుగురు రాక్షసులు మూకుమ్మడి దాడి చేస్తే కాపాడండి కాపాడండి అని అరచినా రక్షించ లేని సమాజం ముందు అచేతనంగా మిగిలిపోయింది.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య ఘటనపై స్పందించిన నిర్భయ తల్లి ఆశాదేవి
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి, నలుగురు మానవ మృగాలు అత్యాచారం చేసి, హతమార్చి ఆ తరువాత మృతదేహం పైన కూడా అఘాయిత్యాలకు పాల్పడ్డారు అంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే క్రూరత్వం ఎక్కడ ఉండదు అని చెప్పక తప్పని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన నేపథ్యంలో దేశం మొత్తం స్పందించింది. ముక్తకంఠంతో నిందితులను శిక్షించాలని, మరణ శిక్ష విధించాలని నినదిస్తోంది. అయితే ఈ హత్య ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు.
మన వ్యవస్థలోని లోపాల వల్లే నేరాలన్న నిర్భయ తల్లి
ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఆమె,మన వ్యవస్థలో లోపాల వల్లే ఈ తరహా ఘటనలు పదే పదే ఉత్పన్నమవుతున్నాయి ఆవేదన చెందారు. నేరస్తులు ఏ సమయంలోనైనా భయం లేకుండా తిరుగుతున్నారని పేర్కొన్నారు. రాత్రి 11 అయినా, రెండు గంటలైనా మగవాళ్ళు తిరిగినంతగా,మహిళలు బయటకు రాలేని పరిస్థితి అని ఆమె అన్నారు. అంతేకాదు ఏదైనా నేరం చేస్తే రెండు మూడేళ్లు జైలు కి వస్తే సరిపోతుంది అన్న భావన నేరస్తులను భయం లేకుండా చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
చట్టాలను నేరస్తులు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆవేదన
న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని నేరస్థులు చెలరేగి పోతున్నారని, ఇది మన దౌర్భాగ్యం అని ఆశా దేవి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్భయ కేసులో నేటికీ తాను పోరాడుతున్నానని, ఏడు సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆమె ఆవేదన చెందారు. కోర్టులు, చట్టాలు నేరస్తులకు చుట్టాలుగా మారుతున్న క్రమంలో న్యాయం ఎక్కడ జరుగుతుంది అని, నేరస్తులు ఎందుకు భయపడతారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన దేశం ప్రధానంగా పురుష ప్రధాన దేశమని, ఇన్ని సంవత్సరాల పోరాటం లో తనకు అర్థమైందని నిర్భయ తల్లి ఆశా దేవి పేర్కొన్నారు.
నిందితులకు మరణ దండన పడేలా ప్రభుత్వాలు చొరవ చూపాలన్న ఆశాదేవి
ఒక ఘటన జరిగిన తర్వాత వెంటనే స్పందించిన ప్రభుత్వం, నేరస్తులకు శిక్ష పడే విషయంలో కూడా ఆ తరహా స్పందన తెలియ చేస్తే బాగుంటుందని ఆమె అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగటం చాలా బాధకరమన్నారు నిర్భయ తల్లి . ఆడపిల్లలు బయటకు వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డలానే ప్రియాంక కూడా మృగాళ్ల చేతిలో బలైపోయిందని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది.
ప్రియాంకా రెడ్డి హత్యకు కారకులైన వారిని ఉరి తియ్యాలన్న నిర్భయ తల్లి
మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, దోషులకు కఠిన శిక్షలు వేయాలని ఆమెఅన్నారు. వారికి ఉరిశిక్ష వేసి సమాజంలోని మృగాలకు హెచ్చరిక జారీ చేయాలని పేర్కొన్న ఆశా దేవి, నేటికీ నిర్భయ విషయంలో తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ నిర్భయ తల్లి ఆశాదేవి చెప్పిన విషయాన్ని చాలామంది సామాజిక వేత్తలు అంగీకరిస్తున్నారు. నేరం జరిగిన తర్వాత పోలీసులు, నేరస్తులను అరెస్ట్ చేయడం వారిని కోర్టుకు పంపించడం, ఆ తర్వాత వారికి కోర్టులు శిక్షలు వేయడం పరిపాటిగా మారింది. కొంతకాలం జైల్లో ఉండి, మళ్లీ తిరిగి వచ్చి యధావిధిగా మృగాళ్లు జీవన సాగిస్తుంటే, బలైపోయిన అబలల ఆర్తనాదాలు మాత్రం వారి కుటుంబాలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తూనే ఉన్నాయి.