నేను మందు సీసాలను నమ్ముకోలేదు: కేసీఆర్, మోడీ ఇంత తెలివి తక్కువోడు అనుకోలేదు
మహబూబ్ నగర్: తనను కొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
కేసీఆర్ను అడ్డుకునేందుకు ఇంతమంది రావాలా అని ప్రశ్నించారు. కేంద్రంలో వచ్చేసారి ఫెడరల్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను మోడీతో, బీజేపీతో కుమ్మక్కయ్యాని కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆరోపిస్తారని, నరేంద్ర మోడీ వచ్చి కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారని చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో చెప్పారు!
ఎవరితోను పొత్తు లేదు
అసలు తమకు ఎవరితో పొత్తు లేదని, అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దేశంలో ఇద్దరు దరిద్రులు పోయి ఫెడరల్ ఫ్రంట్ రావాలని కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతో పెద్ద మేధావిని అని చెప్పుకునే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మన పథకాలను కాపీ చేస్తున్నారని విమర్శించారు.
మందుసీసాలను నమ్ముకోలేదు
తాను మందుసీసాలను నమ్ముకోలేదని, ప్రజలను నమ్ముకున్నానని కేసీఆర్ చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం ఆగం కావొద్దని చెప్పారు. మంచి గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, ఇతర పార్టీలు ఒక వైపు ఉంటే మనం ఒక వైపు ఉన్నామని చెప్పారు. నాలుగేళ్లు సుపరిపాలన అందించిన తెరాసకు ఓటు వేయాలన్నారు. తెలంగాణను సాధించింది తెరాస అన్నారు.
యాగం చేస్తే మీ ముల్లె ఏంబాయె
తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ చెప్పారు. తాను యాగం చేస్తే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయమని, నేను యాగం చేస్తే మీ ముల్లే ఏంబోయిందని (మీకు ఏం నష్టం జరిగింది) ఆయన ప్రశ్నించారు. భక్తి ఉంటే వచ్చి తీర్థం తీసుకు వెళ్లాలని సూచించారు. నేను పూజలు చేస్తే మోడీ సోమ్ము ఏం పోయిందన్నారు.
ఇంత తెలివి తక్కువోడు అనుకోలేదు
దేశంలో 70వేల టీఎంసీల నీరు ఉందని, పాలకుల నిర్లక్ష్యం వల్ల సముద్రం పాలు అవుతున్నాయని కేసీఆర్ చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందనే విషయాన్ని ప్రధాని మోడీ గుర్తించాలని చెప్పారు. గాచారం బాగోలేక మోడీ మనతో పెట్టుకున్నాడని, ఇంత తెలివి తక్కువోడని అనుకోలేదన్నారు.