కిష్టారెడ్డి కుమారుడికి టికెట్, మజ్లీస్తో పొత్తు ఉండదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ: వరంగల్ లోకసభ ఉప ఎన్నిక ఫలితం తమకు బాధ కలిగించిందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్తో భేటీ తర్వాత ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
వరంగల్ ఓటమిపై, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. ఇతర పార్టీల సహకారం తీసుకుని శాసన మండలి ఎన్నికల్లో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. సమన్వయ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే పి. కిష్టారెడ్డి కుమారుడినే బరిలోకి దించుతామని చెప్పారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో మజ్లీస్తో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలపై కూడా చర్చించామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక ఓటమికి సమిష్టిగా బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు.