టిఆర్ఎస్తో పొత్తుండదు, బాబు దృష్టి పెడితేనే టిడిపికి భవిష్యత్: బండారు సంచలనం
హైదరాబాద్: 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకొంటామంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, మాజీ కేంద్ర మంత్రి బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీచేస్తోందని బండారు దత్తాత్రేయ ప్రకటించారు. చంద్రబాబు దృష్టి పెడితేనే తెలంగాణలో టిడిపికి భవిష్యత్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే ఇప్పటి నుండే ఎన్నికల కోసం తెలంగాణలో ప్రధాన పార్టీలు సన్నద్దమౌతున్నాయి. అయితే గుజరాత్ ఎన్నికల కారణంగా తెలంగాణలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన వాయిదా పడింది.
గుజరాత్ ఎన్నికల తర్వాత తెలంగాణలో పలు పార్టీల నుండి నేతలంతా పెద్ద ఎత్తున బిజెపిలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే రేవంత్రెడ్డి ఎపిసోడ్ కొంత బిజెపికి నష్టం కల్గించింది.
టిఆర్ఎస్తో పొత్తుండదు
2019 ఎన్నికల్లో టిఆర్ఎస్తో పొత్తుండదని బిజెపి సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. గత ఎన్నికల సమయంలోనే టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని బిజెపి బావించింది. అయితే టిఆర్ఎస్ మాత్రం అంగీకరించలేదు. టిఆరఎస్ నేతలు కొందరు ఈ పొత్తు ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నా.... కెసిఆర్ మాత్రం ఒంటరిపోరుకే మొగ్గు చూపారు. మరో వైపు టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకొంది.అయితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని బిజెపి నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేయడమే మేలని బిజెపి భావిస్తోంది. అదే సమయంలో టిడిపి కూడ బలహీనపడడం కూడ ఈ నిర్ణయానికి కారణంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని కూడ బిజెపి నేతలు భావిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేయడం వల్ల రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదంటున్నారు నేతలు.
చంద్రబాబు దృష్టి పెడితేనే టిడిపికి భవిష్యత్
తెలంగాణలో టిడిపి తీవ్రంగా నష్టపోయిందని దత్తాత్రేయ అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబునాయుడు కేంద్రీకరిస్తేనే తెలంగాణలో ఆ పార్టీ బలపడే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బాబు వ్యూహలను రచిస్తే తప్ప ఆ పార్టీ మనుగడ కష్టమనే అభిప్రాయపడ్డారు దత్తాత్రేయ.
గుజరాత్ ఎన్నికల ప్రభావం ఉంటుందా?
2019 ఎన్నికల్లో గుజరాత్ ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉంటుందని బిజెపి నాయకత్వం అభిప్రాయపడుతోంది. తెలంగాణలో ఒంటరిపోరుకు ఈ మేరకు బిజెపి నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యూహం ఉందంటున్నారు. ఇతర పార్టీల నుంండి బలమైన నేతలను బిజెపిలోకి వలసలు వచ్చేలా ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసిందనే ప్రచారం కూడ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై బిజెపి కేంద్రీకరించింది. అయితే రేవంత్ రెడ్డి ఎపిసోడ్ బిజెపికి రాజకీయంగా నష్టం కల్గించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే గుజరాత్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలుంటాయని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు..
దక్షిణాదిలో బలపడే వ్యూహమిలా
దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని బిజెపి భావిస్తొంది. దక్షిణాదిలో బిజెపికి కర్ణాటక తర్వాత తెలంగాణ రాష్ట్రంపై కేంద్రీకరించింది. త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల సమయంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్ షా ఇప్పటికే రాష్ట్ర నేతలకు దిశా నిర్ధేశం చేశారు. మరో దఫా పర్యటన చేయాల్సిన సమయంలోనే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చింది. దీంతో అమిత్ షా పర్యటన రద్దైంది. గుజరాత్ ఎన్నికల తర్వాత అమిత్షా తెలంగాణలో పర్యటించనున్నారు.