ఇప్పుడైతే ఏ ఫ్రంట్ లేదు; దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం: జార్ఖండ్ లో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించారు. జార్ఖండ్ లో సీఎం హేమంత్ సోరెన్ ఆయన తండ్రి శిబూసోరెన్ తో కెసిఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. హేమంత్ సోరెన్ తో ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘ చర్చ జరిపిన సీఎం కేసీఆర్ ఆయనతో సమావేశం అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
జార్ఖండ్ లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జార్ఖండ్ సీఎంతో జాతీయ రాజకీయాలపై చర్చించామని పేర్కొన్న సీఎం కేసీఆర్ త్వరలోనే అందర్నీ కలుస్తామని దేశానికి ఇప్పుడు కొత్త అజెండా కావాలని పేర్కొన్నారు. కొత్త పంధాలో, కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ప్రస్తుతానికి ఏ ఫ్రంట్ లేదు..ముందు ముందు చెప్తాం
యాంటీ బీజేపీ ఫ్రంట్ సాగిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు బదులుగా సీఎం కేసీఆర్ భారత్ ను సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నాలు జరగాలని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎటువంటి ఫ్రంట్ లేదని పేర్కొన్న కెసిఆర్, ఏర్పడబోయే ఫ్రంట్ ముందు ముందు తెలుస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. తాము ఎవరికీ అనుకూలం కాదని, అలా అని ప్రతికూలం కూడా కాదని పేర్కొన్నారు. ఆయన దేశం బాగు కోసం తమ ప్రణాళిక ఉంటుందని వెల్లడించారు.

కాస్త ఓపిగ్గా ఉంటే తాము ఏం చేయబోతున్నాం అనేది తెలుస్తుంది
75 ఏళ్ల లో ఆశించిన రీతిలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అచ్చే భారత్ విషయంలో మీ సహాయం కూడా అవసరం అంటూ కెసిఆర్ వెల్లడించారు. అచ్ఛే భారత్, ప్రస్తుతం ఉన్న భారత్ కన్నా మెరుగైన దేశాన్ని సృష్టించాలన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, కాస్త ఓపిగ్గా ఉంటే తాము ఏం చేయబోతున్నాం అనేది ముందు ముందు అన్ని విషయాలు విపులంగా వెల్లడిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
ఇక ఇదే సమయంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని గాల్వాన్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తానని నాడు మాట ఇచ్చామని, ఇప్పుడా మాటను నిలబెట్టుకున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. ఈరోజు జార్ఖండ్ లో రెండు కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గాల్వాన్ లోయలో వీర మరణం చెందిన సంతోష్ తెలంగాణా వ్యక్తి అని పేర్కొన్నారు. తెలంగాణాలోనూ అమరుల కుటుంబాలకు అండగా ఉన్నామని వెల్లడించారు.

శిబూసోరెన్ తెలంగాణా ఏర్పాటుకు సహకరించారు
ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం సమయం నుంచి హేమంత్ సోరేన్ తండ్రి శిబూసోరెన్ తో ఎంతో మంచి అనుబంధం ఉందని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన ఎన్నోసార్లు మద్దతు పలికారని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటుకు కూడా శిబూసోరెన్ సహకరించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారని, తాను శిబూసొరేన్ ఆశీర్వాదం తీసుకున్నాను అంటూ తెలంగాణా సీఎం కేసీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications