బొట్టు నీరు లేక.. చుక్క వాన లేక.. ఖరీఫ్ సాగు కష్టమేనా?
హైదరాబాద్ : ఖరీఫ్ సాగుపై గంపెడాశలు పెట్టుకున్న రైతన్నలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు ఎండిపోవడం.. మరోవైపు వర్షాలు పడకపోవడం అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. ఖరీఫ్ సీజన్ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసిన రైతులు సరైన వర్షాలు లేక కుంగిపోతున్నారు.
జూన్ మొదటివారంలో వర్షాకాలం సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జూన్ మాసం పూర్తికావస్తున్నా.. ఇంతవరకు భారీ వర్షాలు పడలేదు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో మూడు నాలుగు రోజుల కిందట అక్కడక్కడ వానలు పడ్డా.. పూర్తిస్థాయిలో మాత్రం వరుణిడి జాడ లేదు. దాంతో ఖరీఫ్ సాగుపై ఆశలు పెట్టుకున్న రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్ మరిచారు, జీతాల్లేవు.. ఆ పోస్టుతో తిప్పలెన్నో..!
Recommended Video
వరుణిడి కరుణ కోసం..!
వరుణుడి కరుణ కోసం అన్నదాతలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా మే నెల చివర్లో గానీ.. జూన్ తొలి వారంలో గానీ తొలకరి పలకరించేది. అలా సమృద్ధిగా వర్షాలు కురిసి ఇప్పటికే నెలరోజుల పంట సాగయ్యేది. కానీ, ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఒక్క ఎకరంలో కూడా పంటసాగును చేయలేకపోయారు. ఇప్పటికే పంటపొలాలను దుక్కిదున్ని సిద్ధం చేసుకున్న రైతులు వానదేవుడి కరుణ కోసం ఆశలు పెట్టుకున్నారు. వానలు పడటమే ఆలస్యం సాగుకు సిద్ధమైపోయారు. ఎరువులు, విత్తనాలు కూడా రెడీగా పెట్టుకున్నారు.
పంటసాగుకు సిద్ధమైనా.. భారీ వర్షాలు లేక రైతుల ఆవేదన
సాయంత్రం సమయంలో తేలికపాటి జల్లులు మాత్రమే పడుతూ అన్నదాతలను ఊరిస్తున్నాయి. అలా వరుణిడి కరుణ కోసం ఎదురుచూపులు చూస్తున్న రైతన్నల ఆశలు ఆవిరవుతున్నాయి. అయితే మాన్సూన్ ప్రారంభమై మూడు వారాలు దాటుతున్నా.. ఇంతవరకు ఒక్క భారీ వర్షం పడలేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా వ్యవసాయ భూములు పచ్చగా కనిపించడం లేదు. వానల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు.. ఆరుతడి పంటలతో పాటు మెట్టపంటల సాగుకు సిద్ధమయ్యారు. అయితే భారీ వర్షాలు పడకపోవడంతో కుంగిపోతున్నారు.
బోరుబావుల్లో సైతం తగ్గిన నీటి శాతం
అటు వానలు సరిగా పడక.. ఇటు గ్రౌండ్ వాటర్ సరిగా లేక రైతన్నల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వానలు సమృద్ధిగా కురవక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోరుబావులు సైతం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. నెల కిందటి వరకు రెండు ఈంచుల వరకు నీళ్లు వచ్చే బోర్లు సైతం ప్రస్తుతం ఈంచు, అర ఇంచుకు తగ్గిపోవడం గమనార్హం. దాంతో బోరుబావులున్న రైతులు కూడా పంట సాగుకు ముందురాని పరిస్థితి కనిపిస్తోంది.
అదలావుంటే కొంతమంది రైతులు ధైర్యం చేసి సీడ్ పత్తి పంటను సాగు చేశారు. అయితే బోరుబావుల్లో రోజురోజుకీ నీళ్లు తగ్గుతుండటంతో పరిస్థితి దీనంగా తయారైంది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగుకు సిద్ధమైనప్పటికీ.. పంట చేతికి వస్తుందో రాదో తెలియక ఆ రైతులు టెన్షన్ పడుతున్నారు.
15 రోజులు ఇలానే ఉంటే.. ఖరీఫ్ సాగు కష్టమేనా?
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అటు వానలు లేక, గ్రౌండ్ వాటర్ లేక రైతులు సతమతమవుతున్నారు. రైతులకు అవసరమయ్యే సబ్సిడీ ఎరువులు, విత్తనాలు వ్యవసాయ శాఖ అధికారులు ఇంతవరకు సిద్ధం చేయలేదు. మరో 15 రోజుల పాటు వర్షాలు సమృద్ధిగా పడక పరిస్థితి ఇలానే ఉంటే ఖరీఫ్ సాగు కష్టమేనంటున్నారు రైతన్నలు.
ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవకపోవడంతో జూరాల ప్రాజెక్టులో జలకళ కనిపించడం లేదు. కనీసం జూరాలకు నీళ్లు వచ్చినా.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్లను నింపితే అంతో ఇంతో పంటసాగుకు అవకాశం ఉండేదని చెబుతున్నారు అన్నదాతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి ఛాన్స్ కనిపించకపోవడంతో ఖరీఫ్ సీజన్పై ఆందోళన చెందుతున్నారు.