వ్యాక్సిన్ కొరత లేదు, గాంధీలో ప్రత్యేక కరోనా టీకా కేంద్రం: కిషన్ రెడ్డి
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. కరోనా వ్యాక్సిన్, చికిత్సా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని, ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా కరోనా మహమ్మారిపై విజయం సాధించలేమని, అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కిషన్ రెడ్డి కోరారు. కరోనా టీకా వేయించుకున్నవారు నిర్లక్ష్యం వహించవద్దన్నారు.
టీకా ఉత్సవ్పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎక్కడా వ్యాక్సిన్ కొరత లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వ్యాక్సిన్ తరలింపులో లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని, దేశంలో రెండు సంస్థలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు.
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు అద్భుతంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. మనదేశంతోపాటు మరో 58 దేశాలకు భారత్ నుంచి వ్యాక్సిన్ సరఫరా అవుతోందని, ముందుగా మనదేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు అవకాశం ఉన్నన్ని డోసులు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కోవాగ్జిన్ టీకా తీసుకున్నారని చెప్పిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తాను కోవిషీల్డ్ టీకా తీసుకున్నట్లు తెలిపారు. ఏ వ్యాక్సిన్ అయినా కరోనా కట్టడికి పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఉచితంగానే అందిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రాన్ని గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా వ్యాక్సిన్ కొరత లేదని చెప్పారు. కాగా, మహారాష్ట్రలో వ్యాక్సిన్ కొరత భారీగా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, కేంద్రం మాత్రం కరోనా కొరత లేదని, మహారాష్ట్ర సర్కారు టీకాల విషయంలోనూ రాజకీయం చేస్తోందని మండిపడుతోంది.
Recommended Video