కొత్త పార్టీ... సాగర్ ఉపఎన్నికలో పోటీపై తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన... త్వరలో మరో పాదయాత్ర..
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పేరు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఒక సామాన్యుడిగా ఎన్నికల్లో పోటీ చేసి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించడం మామూలు విషయం కాదని చాలామంది ఆయన్ను అభినందించారు. అదే సమయంలో మల్లన్న వెనుక కనిపించని శక్తులు ఉన్నాయని... బీజేపీతో ఆయనకు రహస్య సంబంధం ఉందని చాలామంది వాదిస్తున్నారు. మల్లన్న మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేస్తూ వస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో జరిగిన బహిరంగ సభలో తన భవిష్యత్ కార్యాచరణపై మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కొత్త పార్టీ పెట్టను : తీన్మార్ మల్లన్న
కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని,పెట్టనని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని కూడా చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలోనూ తాను పోటీ చేయబోవడం లేదన్నారు. తెలంగాణవ్యాప్తంగా తీన్మార్ మల్లన్న టీమ్ పేరిట రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.త్వరలో తెలంగాణవ్యాప్తంగా 6వేల కి.మీ పాదయాత్ర చేపట్టనున్నట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు. ఈ సభకు భారీ ఎత్తున మల్లన్న మద్దతుదారులు తరలివచ్చారు.

కేసీఆర్ సర్కార్పై నిప్పులు
తెలంగాణలో కేసీఆర్ పాలన అంతమే లక్ష్యంగా పనిచేస్తానని తీన్మార్ మల్లన్న ఇదివరకే పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్ను ఆస్పత్రిలో పరామర్శించిన సందర్భంగా మల్లన్న ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఉద్యోగం ఊడితే తప్ప తెలంగాణ యువతకు నిరుద్యోగులు రావన్నారు. ఐదో తరగతి చదివినవాళ్లు రాష్ట్రంలో మంత్రులుగా ఉంటే... పీహెచ్డీ చేసినవాళ్లు స్ట్రెచర్ ఎక్కుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యకు యత్నించిన బోడ సునీల్కు రూ.50లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను పొట్టనపెట్టుకుంటున్న సీఎం కేసీఆర్ను హన్మకొండ చౌరస్తాలో ఉరితీసిన తక్కువేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దూకుడుగా ముందుకు...
ఇటీవలి వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ధీటుగా తీన్మార్ మల్లన్న ఓట్లు సాధించిన విషయం తెలిసిందే. విజయం పల్లా రాజేశ్వర్ రెడ్డినే వరించినప్పటికీ నైతిక విజయం తనదేనని మల్లన్న చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన లక్ష పైచిలుకు ఓట్లతో మరింత దూకుడుగా భవిష్యత్ కార్యాచరణ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికైతే స్వతంత్ర అభ్యర్థిగానే వ్యవహరిస్తున్న మల్లన్న... భవిష్యత్తులోనూ ఇదే పంథా కొనసాగిస్తారా లేక ఏదో ఒక పార్టీ చెంతన చేరుతారా అన్నది చూడాలి.












Click it and Unblock the Notifications