రెగ్యులర్ వీసీ లేదు.. డీన్ సహా అంతా ఇన్చార్జీలే: ఎంపీ సోయం బాపూరావు ఫైర్
డిమాండ్ల సాధన కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు రోడ్డెక్కారు. నిన్న నిరసన చేయగా.. ఇవాళ పర్మిషన్ లేదని పోలీసులు అంటున్నారు. తమ 12 డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థులు అంటున్నారు. దాదాపు 2 వేల మంది కదం తొక్కారు. దీనిపై విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు స్పందించారు.
రానీ నిధులు
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడమే వర్సిటీలో సమస్యలు పెరిగిపోవడానికి ప్రధాన కారణమని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇవాళ్టి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ నియామకం జరగలేదన్నారు.
అంతా ఇన్చార్జీలే..
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, వర్సిటీ డీన్ ఇలా అందరూ ఇన్చార్జులే పాలకవర్గంలో ఉన్నారు. దీంతో ట్రిపుల్ ఐటీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. మూడేళ్ల నుంచి విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన ల్యాప్టాప్స్, యూనిఫామ్స్, ఇతర వస్తువులు ఇవ్వడం మరిచారు.
ప్రభుత్వ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. తరచుగా ఆహారంలో పురుగులు వస్తున్నప్పటికీ అధికారులు మెస్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మంచి నీటి సరఫరా కూడా సక్రమంగా లేదు. ఈ సమస్యలను ఎంపీ వివరించారు.
కలుషిత నీరే
కలుషిత నీటిని అందిస్తున్నారు. పడుకోవడానికి బెడ్లు కూడా లేకుండా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 250 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఆరేళ్ల నుంచి ఈ అంశం పెండింగులో ఉంది. నాలుగేళ్లుగా రాష్ట్ర బడ్జెట్లో ట్రిపుల్ ఐటీకి అరకొర నిధులే కేటాయించారు. ఆ నిధులు కూడా ప్రభుత్వం పూర్తిగా ఇవ్వడం లేదని సోయం బాపూరావు అన్నారు. దీంతో విద్యార్థులు రోడ్డెక్కారని చెప్పారు. వారి న్యాయమైన 12 డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.