నాగార్జున సాగర్ ఉపఎన్నిక విజయంపై నోముల భగత్, సీఎం కేసీఆర్ రియాక్షన్స్..
నాగార్జున ఉపఎన్నిక విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఉపఎన్నికలో విజయంపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సంతోషం వ్యక్తం చేశారు.తనకు తొలి విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. తన విజయం కోసం కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తన తండ్రి నోముల నర్సింహయ్య ఆశయాలు నెరవేరుస్తానని, అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విజయం ముఖ్యమంత్రి కేసీఆర్కు అంకితం అని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానన్నారు.
కేసీఆర్ రియాక్షన్...
నోముల భగత్ను ఆశీర్వదించి గెలిపించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ఓటర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. విజయం సాధించిన నోముల భగత్కు అభినందనలు తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని చెప్పారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్తో కలిసి నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దేవరకొండ,నాగార్జునసాగర్,మిర్యాలగూడ,హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల్లో మంజూరు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఎవరెంత దుష్ప్రచారం చేసినా... అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కనబర్చారని తెలిపారు. ఈ విజయంతో టీఆర్ఎస్ మున్ముందు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుందన్నారు.
ఆ స్థాయి ప్రతిపక్షాలకు లేదు... : మంత్రి గంగుల
ఏ ఎన్నికలైనా సరే రాష్ట్రంలో టీఆర్ఎస్దే విజయమని మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు.మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలైనా సరే.. నేటి ఉప ఎన్నిక అయినా, రేపటి మున్సిపల్ ఎన్నికలైనా టీఆర్ఎస్దే గెలుపు అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోనే తమ గెలుపు మంత్రమని చెప్పారు. నాగార్జున సాగర్ ఫలితాలతో టీఆర్ఎస్కు ప్రత్యర్థులమని చెప్పుకునే స్థాయి కాంగ్రెస్, బీజేపీలకు లేదని రుజువైందన్నారు. అధికారం కోసం అడ్డగోలు కూతలు కూసే జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారని ఎద్దేవా చేశారు.
ఈ విజయంతో పొంగిపోవట్లేదు : మంత్రి జగదీశ్వర్ రెడ్డి
మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 19 వేలకు పైగా మెజార్టీ ఇచ్చి గెలిపించిన స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం సీఎం కేసీఆర్ పట్ల నమ్మకానికి, ఆయన నాయకత్వం పట్ల విశ్వసనీయతకు నిదర్శనం అన్నారు. ఈ విజయంతో తామేమీ పొంగిపోవడం లేదని అన్నారు. కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారని చెప్పారు. ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ... తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఈ ఫలితాలను చూసైనా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు పట్టించుకోరని చెప్పారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన వాటిపై పోరాడాలన్నారు.
18వేల ఓట్ల మెజారిటీ
టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కౌంటింగ్ ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ మెజార్టీతో గెలుపొందారు. 18,804 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి రెండో స్థానానికే పరిమితమయ్యారు. బీజేపీ అభ్యర్థి రవి నాయక్ ఏకంగా డిపాజిట్ కోల్పోయారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన అనంతరం ఎమ్మెల్యేగా గెలుపు పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోముల భగత్కు అందజేశారు. టీఆర్ఎస్కు 47శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కు 37శాతం ఓట్లు వచ్చాయి.