పోలీసు శాఖలో ఓ సీఐ ‘డిఫరెంట్లీ పోలీసింగ్’! వైరల్గా మారిన ఫొటో, సీరియస్ అయిన ఉన్నతాధికారులు
ఓ మహిళ ఫిర్యాదు రాస్తున్న సమయంలో ఎదురుగా సీఐ కూర్చున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావుపై ఉన్నతాధిరులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Recommended Video
హైదరాబాద్: పోలీసు శాఖలో ఉన్నతాధికారులంతా 'ఫ్రెండ్లీ పోలీసింగ్' పేరు జపిస్తుంటారు. అర్ధరాత్రి నిద్రలోంచి లేపి అడిగినా వారిది అదే మాట. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే.. కింది స్థాయిలో జరిగేదంతా 'డిఫరెంట్లీ పోలీసింగ్'.
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువ కావాలని ఉన్నతాధికారులు ఎన్నిమార్లు చెప్పినా... కొందరు కింది స్థాయి పోలీస్ అధికారుల బుద్దిమాత్రం మారడం లేదు. దీనికి తాజా ఉదాహరణ.. ఓ మూడు చుక్కల(సీఐ) అధికారి ప్రవర్తన.
ఓ మహిళ ఫిర్యాదు రాస్తున్న సమయంలో ఎదురుగా సీఐ కూర్చున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి నగరంలోని జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావుపై ఉన్నతాధిరులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అసలేం జరిగిందంటే.. ఓ హత్య కేసు విచారణలో భాగంగా జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు మృతుడి ఇంటికి వెళ్లారు. మృతుడి భార్య ఫిర్యాదు రాస్తున్న సమయంలో సీఐ ఆమెకు ఎదురుగా కుర్చీలో కూర్చుని బూటుకాలిని మంచానికి తన్నిపెట్టి కూర్చున్నారు. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది.
సీఐ ఉమామహేశ్వరరావు ప్రవర్తన ఫిర్యాదు రాస్తున్న మహిళను బెదిరించేలా ఉందంటూ ఆ దృశ్యం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో వారు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదొక్కటే కాదు, ఆదినుంచీ అసలు ఆ సీఐ తీరే అంత అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.