రేవంత్ రెడ్డికి నోటీసులు..!అదే వ్యవహారంలో ఆయనపై మాత్రం ఎలాంటి విచారణ లేదు..!!
హైదరాబాద్ : ప్రస్తుత రాజకీయ పరిణామాలుచూస్తుంటే పాత కేసులు తోడి ప్రతీకారం తీర్చకునే సీసన్ లా కనిపిస్తోంది. పాత కేసులను తోడి ప్రతీకారం తీర్చకునే క్రమంలో కొంత వెసులుబాటు కల్పిస్తున్నట్టుగా కూడా స్పష్టమౌతోంది. అర్థబలం, రాజకీయం, పలుకుబడి, మీడియాబడి ఉంటే కేసులనుండి ఉపశమనం పొందొచ్చని ఇటీవల జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఒకే కేసులో ఇద్దరు సమాన ముద్దాయిలని నిర్థారణ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలి గాని ఒకరికి ఊరటకలిగించడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవతల వ్యక్తికి సొంత మీడియా ఉంది కాబట్టి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది పాత కేసులు తోడే సీజన్..! నాయకులు ఉపయోగించాలి విజన్..!!
అదేమి విచిత్రమో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం అసలు పాత కేసుల ఊసే లేదు. ఎప్పుడో 2004 లో జరిగిన కేసుకు సంబంధించి అకస్మిక ఫిర్యాదు చేయడమే కాకుండా, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్టు కూడా అయ్యారు. అంతే కాకుండా మళ్ళీ మరో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి 2001 నాటి కేసుకు సంబంధించి నోటీసులు జారీ అయ్యాయి. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే వంద సీట్లు వస్తాయని చెబుతున్న టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభం అయింది. తప్పు చేసిన వారిపై కేసులు, చర్యలపై ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాని ఏకపక్షంగా వ్యవమరిస్తేనే చిక్కులు వచ్చి పడేది.
ప్రభుత్వ ద్రుష్టిలో ఆయనకో లెక్క...! ఈయనకో లెక్క..!
ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉన్నంత కాలం చర్యలు వదిలేసి, ఇప్పుడు ఆకస్మాత్తుగా పాత కేసుల విచారణ అంశాలను అన్నింటిని తెరపైకి తేవటం రాజకీయం కాక మరేమి ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఇక్కడ ప్రభుత్వానికి ఓ వెసులుబాటు కూడా ఉంది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఇలాంటి పనులు చేయటం లేదు. పోలీసులు మాత్రమే చేస్తున్నారు అని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ ప్రజలు అంత అమాయకులా? అందునా కేవలం కాంగ్రెస్ నేతలపై కేసులే బయటకు వస్తున్నాయా? అంటే ప్రభుత్వం తెర వెనక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తుందనే విషయం ఎవరైనా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసులో తాజాగా రేవంత్ రెడ్డికి జూబ్లిహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..!
మీడియాను అడ్డం పెట్టుకుని ఏదైనా చేయొచ్చా..!అందుకు సర్కార్ సహకారం కూడా ఉంటుందా..?
రేవంత్ తో పాటు మరికొంత మందికి కూడా నోటీసులు వెళ్లాయని ప్రచారం జరుగుతోంది. మరి ఇదే జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ కేసులో ప్రముఖ మీడియా ఓనర్ పై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన అక్రమాలకు సంబంధించి ఏకంగా విజిలెన్స్ నివేదిక కూడా ఉంది. అది ప్రభుత్వం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. రేవంత్ రెడ్డికి ఇదే హౌసింగ్ సొసైటీ కేసులో నోటీసులు ఇచ్చి, అదే మీడియా అధినేతను వదిలేయటం వెనక మతలబు ఏంటి? చేతిలో మీడియా ఉంది కాబట్టి వదిలేశారా?. అందులో ఎన్నికల సీజన్ అందుకే ఆయనకు ఉపశమనం కలిగించారనే చర్చ కూడా జరుగుతోంది.
చట్టం అందరికి సమానమన్నప్పుడు ఎందుకీ వివక్ష..! అందరికి పడాలి శిక్ష..!
ఇక కేసులు ఉన్న మీడియా సంస్థలు ఉంటే పాలకులకు పని సులభం . జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన అక్రమాల విషయంపై చర్యలు తీసుకోదలచుకుంటే అంతా సమానంగా ఉండాలి కదా? కానీ ఆ మీడియా అధినేతను వదిలేసి, కేవలం ఎంపిక చేసిన వారికే నోటీసులు జారీ చేయటం రాజకీయం కాక మరేమిటనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అదే మీడియా ఓనర్ సొసైటీ ప్రెసిడెంట్ గా పనిచేసిన సమయంలో పలు అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల మేర అనుచిత లబ్ధి పొందినట్లు గుర్తించారు. కానీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు గాని, విచారణ గానీ లేదు. అదే రాజకీయ నాయకులకు, మీడియా అధినేతలకు ఉన్న తేడా అని సామాన్యులు సైతం చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.