పుట్టిన రోజునాడే కారు ప్రమాదం: అమెరికాలో తెలుగు టెక్కీ మృతి
భువనగిరి: అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న భువనగిరి పట్టణానికి చెందిన పోత్నక్ ప్రదీప్ (28) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అమెరికాలోని నార్త్కరోలినాలో ఈ ప్రమాదం జరిగింది. పుట్టిన రోజునాడే ఈ ఘటన చోటు చేసుకోవడం అతని కుటుంబంలో తీరని విషాదం నింపింది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం ప్రదీప్ జన్మదినం కావడంతో భార్య కీర్తనతో సహా ఎనిమిది మందితో కలిసి విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల సమయంలో ప్రదీప్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో కీర్తనతోపాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రదీప్ పనిచేస్తున్న సంస్థ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు ఈ మేరకు సమాచారం అందించారు.
కాగా, అమెరికాలోని నార్త్కరోలినాలోని డెల్ సంస్థలో ప్రదీప్ పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ప్రదీప్ 2010లో అమెరికా వెళ్లారు. డిసెంబర్ 2015లో వివాహమైంది. ప్రదీప్ తండ్రి మురళి బీజేపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్. మురళికి ప్రదీప్ ఒక్కడే కుమారుడు. ఇద్దరు కుమార్తెలు. ప్రదీప్ మృతి ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.