పెళ్లైన మూడ్రోజులకే పరారైన ఎన్నారై: ఫారెన్లో ఇలాగే చేస్తామని...!
హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన ప్రశాంతి అనే యువతిని ఎన్నారై శ్రవణ్ పెళ్లి చేసుకొని, మూడు రోజుల పాటు కాపురం చేసి ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. బాధితురాలు అతనికి ఎన్నిమార్లు ఫోన్ చేసినా ఫారెన్లో నచ్చితేనే పెళ్లి చేసుకుంటామని, లేదంటే వదిలేస్తామని, నీతోను అంతేనని చెప్పాడు.
తాను ఇరవై రోజుల క్రితం చివరిసారి అతనితో మాట్లాడానని, తనను తీసుకు వెళ్తానని ఇప్పటి వరకు అతను చెప్పలేదన్నారు. పైగా తనను వదిలేస్తున్నట్లు చెప్పాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇధ్దరికి పెళ్లైన మూడు రోజుల వరకు బాగానే ఉన్నామని చెప్పారు.
ఆ తర్వాత హఠాత్తుగా విదేశాలకు వెళ్లిపోయాడని, ఫోన్ చేస్తే సానుకూలంగా స్పందించడం లేదన్నారు. అతను మరో పెళ్లి చేసుకుంటున్నట్లుగా తెలిసిందని, అలా అయితే కేసు పెడతామని చెప్పారు. శ్రవణ్ మోసం గురించి అతని తల్లిదండ్రులను అడిగితే... దాని గురించి తమకు తెలియదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎనిమిది నెలల క్రితం తమ ప్రేమ మొదలైందని, పెళ్లై అయిదు నెలలు అవుతోందని చెప్పారు. వరంగల్ వచ్చి మరీ తనను పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. మూడు రోజుల పాటు తాము సంతోషంగానే ఉన్నామన్నారు. తనకు తన తల్లిదండ్రుల మద్దతు ఉందని చెప్పారు.
తనను అత్తింటి వద్దని చెబుతున్నారన్నారు. తాను యూరోప్ సిటిజన్ను అని, తనను ఎవరూ ఏం చేయలేరని అతను చెబుతున్నాడని బాధితురాలు వాపోయారు. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆమె చూపించారు. అతని తరఫున పెళ్లికి ఎవరూ రాలేదని చెప్పారు. వీడియో కాల్లో తాము చాటింగ్ చేసుకున్నామన్నారు.
తాము గతంలో హైదరాబాదులో రెండుసార్లు, వరంగల్లో ఒకసారి కలుసుకున్నామని చెప్పారు. పెళ్లి సమయంలో ఖర్చుల నిమిత్తం తాను రూ.2 లక్షలు ఇచ్చానని ఆమె చెప్పారు. కాగా వరంగల్ జిల్లాకు చెందిన ప్రశాంతి అనే యువతిని శ్రావణ్ అనే ఎన్నారై పెళ్లి పేరుతో మోసం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.