దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్... రామగుండంలో ఏర్పాటు చేయనున్న ఎన్టీపీసీ...
తెలంగాణలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఎన్టీపీసీ సంస్థ దీన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ పనులు ఇప్పటికే నిర్మాణ దశలో ఉండగా మే నెల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 450 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్న ఎన్టీపీసీ.. అందులో భాగంగా రామగుండంలో ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ ఈ వివరాలు వెల్లడించారు.
రిజర్వాయర్పై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్
దేశవ్యాప్తంగా మొత్తం 217 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఒకేచోట 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను నెలకొల్పనుంది. రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్పై ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది. రిజర్వాయర్ ఉపరితలంపై మొత్తం 450 ఎకరాల విస్తీర్ణంలో రూ.430కోట్లు వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు.
ఇంకా ఎక్కడెక్కడ ఫ్లోటింగ్ ప్లాంట్స్...
రామగుండంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. రామగుండంతో పాటు కేరళలోని కయంకుళంలో 92 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, సింహాద్రిలో 25 మెగావాట్ల యూనిట్ను ఎన్టీపీసీ ఏర్పాటు చేయనుంది. తమిళనాడులోని ట్యుటికోరిన్ సమీపంలో ఎట్టాయపురంలో 230 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. నిజానికి ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్స్ ఇదివరకే నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా... కోవిడ్ 19 కారణంగా ఆలస్యమైంది.
రామగుండంలో మరో రెండు యూనిట్లు...
ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి ఐదెకరాల విస్తీర్ణం అవుతుందని ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ తెలిపారు. రామగుండంలో ప్రస్తుతం 9,125 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీనికి తోడు మరో 4వేల మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ఎన్టీపీసీ చేపట్టనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తొలి యూనిట్ 2022 జనవరిలో, రెండోది 2022 మార్చిలో అందుబాటులోకి రానుందని ఆనంద్ తెలిపారు.