హైదరాబాదులో కరోనావైరస్తో మృతి చెందిన వ్యక్తికి చికిత్స అందించిన నర్సుకు వైరస్..?
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ భారత్ను సైతం వణికిస్తోంది. చైనాలోని వూహాన్ నగరం కేంద్రబిందువుగా బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. దీంతో చాలా దేశాల్లో అక్కడి ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇక ఈ రక్కసి హైదరాబాద్ను కూడా కొన్ని రోజుల క్రితం తాకింది. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో అతనికి వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా కర్నాటకకు చెందిన 76 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఇక్కడే ఆ వ్యక్తి మృతి చెందాడు.
కర్నాటకలోని కాలాబురగీకి చెందిన 76 ఏళ్ల మొహ్మద్ హుస్సేన్ సిద్దిఖీని బీదర్ నుంచి హైదరాబాద్కు తరలించారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపుడుతున్నాడని తెలుసుకున్న వైద్యులు కరోనావైరస్ పరీక్షల కోసం శాంపిల్స్ పంపగా అతనికి పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన్ను ఓ ఎమర్జెన్సీ గదిలో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. మంగళవారం రోజున అతను మృతి చెందాడు. అయితే గురువారం రోజున తెలంగాణ వైద్యాధికారులు హుస్సేన్ మృతి చెందిన ప్రైవేట్ హాస్పిటల్కు చేరుకుని అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఐసొలేషన్ వార్డులో అతనికి నర్సింగ్ కేర్ ఇచ్చిన నర్సును కూడా ప్రతిరోజు వైద్యులు పర్యవేక్షించాలని కోరారు. ప్రస్తుతం ఆ నర్సులో ఎలాంటి కరోనావైరస్ లక్షణాలు కనిపించడం లేదు. అయితే భవిష్యత్తులో సోకే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరించారు.
Recommended Video
ఇదిలా ఉంటే భారత్లో కరోనావైరస్ కేసుల సంఖ్య 70కి పైగా చేరుకుంది. ఇప్పటికే భారత్ నుంచి పలు దేశాలకు వెళ్లే విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియాతో పాటు పలు విమానాయాన సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే రోమ్, మిలాన్, సియోల్ దేశాలకు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఇక కరోనావైరస్ అంటువ్యాధిగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31 వరకు అక్కడి సినిమాహాళ్లు, బహిరంగ స్విమ్మింగ్ పూల్స్ స్కూళ్లు కాలేజీలను మూసివేయాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇరాన్ నుంచి భారత్కు 120 మందిని ఎయిరిండియా విమానం తీసుకురానుంది. ఈ రోజు జైసల్మేర్కు చేరుకుంటుంది. అక్కడే ఉన్న ఆర్మీ ఫెసిలిటీలో ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తారు.