కేసీఆర్ క్యాబినెట్ లో ఓసీలకే అగ్ర తాంబూలం... అసంతృప్తిలో గులాబీ దళం
ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూసిన తెలంగాణ కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. రాజ్ భవన్ లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో 10మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్ విస్తరణ జాప్యం జరగడంతో కెసిఆర్ పలు విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. దాదాపు రెండు నెలల సమయం తీసుకున్నా సీఎం కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ లో సమన్యాయం పాటించలేదనే భావన వ్యక్తమవుతోంది. సామాజిక , కుల , వర్గ , ప్రాంత సమీకరణాలన్నింటిని బేరీజే వేసుకొని ఎట్టకేలకు విస్తరణచేపట్టినా అగ్రతాంబూలం మాత్రం ఓసీలకు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
మహిళలకు, ఎస్సీ మాదిగ, ఎస్టీలకు క్యాబినెట్లో నో ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలో కొలువుతీరిన కొత్త క్యాబినెట్ విస్తరణలో తన కుటుంబ సభ్యులైన హరీష్ రావు , కేటీఆర్ లకు చోటు కల్పించ లేదు. సామాజిక సమీకరణాలతోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ మహిళలకు స్థానం ఇస్తారని అందరూ భావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత నేటి వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి గా అవకాశం ఇవ్వలేదు సీఎం కేసీఆర్. ఇక రెండో దఫా అధికారంలోకి వచ్చాక కూడా తొలి విస్తరణలో మహిళలకు సైతం స్థానం దక్కలేదు. ఇక ఎస్టీలకు, ఎస్సీ మాదిగ కులానికి కేబినెట్లో స్థానం లేదు.
గతంలోనూ ఓసీలకే పెద్ద పీట
తాజాగా తొలి క్యాబినెట్ విస్తరణలో నలుగురు పాత మంత్రులు ఈటెల - తలసాని - జగదీశ్ రెడ్డి - ఇంద్రకరణ్ రెడ్డిలు కొనసాగుతున్నారు. ఇక మిగిలిన వారు కొత్తవారు.. కేసీఆర్ ఈ విస్తరణలో రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తం పది మందిలో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైతే, ముగ్గురు బీసీ , ఒకరు వెలమ ,ఒకరు ఎస్సీల్లోని మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు. మొత్తంగా కేసీఆర్ క్యాబినెట్ లో ఉన్న 12 మందిని లెక్క చూస్తే సీఎంతో సహా ఏడుగురు ఓసీలే. ఒక మైనారిటీ కి, ఒక ఎస్సీ మాల కు, మూడు బీసీలకు మాత్రమే కేసీఆర్ క్యాబినెట్ లో స్థానం దక్కింది.ఇలా కేబినెట్ విస్తరణలో కేసీఆర్ రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక సమీకరణాల ఏమాత్రం పాటించకుండా కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని గత క్యాబినెట్లోనూ కెసిఆర్ ఓసీలకే పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సారి అదే కొనసాగింది. ఇప్పటివరకు చేసిన మంత్రి వర్గ విస్తరణ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఏ మాత్రం తృప్తినివ్వలేదు.
కొత్త మంత్రుల సామాజిక వర్గ నేపధ్యం... బీసీలకు అన్యాయం
కొత్త మంత్రుల సామాజిక నేపథ్యం చూస్తే కొప్పుల ఈశ్వర్ ఎస్సీ-మాల సామాజిక వర్గానికి చెందినవారు. జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డి,మల్లారెడ్డిలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఎర్రబెల్లి దయాకర్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ఈటల రాజేందర్ బిసి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక శ్రీనివాస్ గౌడ్ బీసీ గౌడ కులానికి చెందినవారు.
బీసీలకు కేబినెట్లో స్థానం అంతంత మాత్రమే
సామాజిక సమతుల్యత పాటించాలని, బీసీలకు క్యాబినెట్ లో సమన్యాయం చేయాలని, రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు క్యాబినెట్ లో 50 శాతం అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఏర్పాటైన కేసీఆర్ క్యాబినెట్ లో బీసీలకు సమ న్యాయం జరగలేదు అన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తంమీద కేసీఆర్ క్యాబినెట్ ఓసీలకు ప్రథమ తాంబూలం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
క్యాబినెట్ విస్తరణ పై గులాబీ శ్రేణుల్లో అసంతృప్తి... నోరు మెదపని కారణం ఇదే
ఉద్యమ సమయం నుండి పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలకు, చాలా మంది సీనియర్ నేతలకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి నెలకొంది. అయినా ఎవరూ గులాబీ బాస్ ముందు తమ అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా నోరు తెరిచి ఏదైనా మాట్లాడితే తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి దెబ్బ పడుతుందన్న భయం పార్టీలోనే అందరు నాయకుల్లో ఉంది. అందుకే మంత్రిగా అవకాశం వస్తుందని భావించిన నేతలు సైతం ప్రస్తుతం జరుగుతున్న మంత్రివర్గ విస్తరణపై నోరు మెదపడం లేదు. తమకు అన్యాయం జరిగిందని బాహాటంగా మాట్లాడడం లేదు. లోలోపల మదనపడి పోతూ ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ ఎదురు తిరిగితే ప్రత్యామ్నాయం కూడా లేకపోవడంతో కిమ్మనకుండా కూర్చున్నారు.