రెండ్రోజుల్లో రెండు పేలుళ్లు: వణికిన ఇబ్రహీంపట్నం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వరసగా రెండో రోజు పేలుడు సంభవించింది. శనివారం రాత్రి 7 గంటలకు ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తాలో భారీశబ్దంతో పేలుడు జరిగి ఇద్దరు గాయపడ్డారు.
కాగా, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మరో పేలుడు సంభవించింది. ముందు రోజు జరిగిన పేలుడుపై ఘటనా స్థలంలో పోలీస్ క్లూస్టీం, బాంబుస్క్వాడ్, డాగ్స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తుండగా ఈ పేలుడు జరగడం గమనార్హం.
ఈ ఘటనలోనూ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఇబ్రహీంపట్నంకు చెందిన నాగమ్మ(47), సీతారాంపేటకు చెందిన మేస్త్రీ యాదయ్య(46), కప్పాపాడ్కు చెందిన కాళిదాస్(50) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటన స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రమాదవశాత్తు పేలుడు పదార్థాలు పేలాయా? లేక ఉగ్ర కుట్రలో భాగంగా ఈ పేలుళ్లు సంభవించాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.