స్మితా సబర్వాల్కు ఎలా ఆర్థిక సాయం చేస్తారు?: మరో పిల్
హైదరాబాద్: ఔట్లుక్పై న్యాయపోరాటం కోసం ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు రూ.15 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. పబ్లిక్ పాలసీకి విరుద్ధంగా జారీచేసిన జీవోను రద్దు చేయాలని హైదరాబాద్ నగరానికి చెందిన చిరుద్యోగి కే ఈశ్వర్రావు పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, ఔట్లుక్ మ్యాగజైన్ కథనం వివాదంలో తెలంగాణ ఐఎఎస్ అధికారి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్కు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.15 లక్షలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైన విషయం తెలిసిందే.
స్మిత సబర్వాల్ వ్యక్తిగత వ్యవహారంలో ఇలా ప్రజాధనాన్ని ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అంటూ అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ రచయిత, సామాజిక కార్యకర్త వత్సల విద్యాసాగర్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, స్మిత సబర్వాల్ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఔట్లుక్ మ్యాగజైన్ ఇటీవల ప్రచురించిన ఓ కథనం, కార్టూన్ తన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ స్మిత సబర్వాల్ ఆ మ్యాగజైన్పై న్యాయపరమైన చర్యలు ప్రారంభించారని పిటిషనర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆ పత్రికపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారని చెప్పారు.
స్మితా సబర్వాల్ ఓ హోటల్లో పాల్గొన్న ప్రైవేట్ కార్యక్రమం గురించి ఔట్లుక్ పత్రిక కథనం, కార్జూన్ ప్రచురించిందని, ఇది ఆమె వ్యక్తిగతమని వ్యవహారమని వత్సల అన్నారు. న్యాయ వివాదంలో గెలిస్తే మంజూరు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని చెప్పిన ప్రభుత్వం, ఓడిపోతే వదులుకుంటున్నట్లు పరోక్షంగా తన ఉత్తర్వుల్లో చెప్పందని అన్నారు.