Galwan valley clash: కల్నల్ సంతోష్బాబును స్మరిస్తోన్న దేశం: సూర్యపేట్లో విగ్రహం
సూర్యాపేట్: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ప్రాణాంతక ఘర్షణలకు ఇవ్వాళ్టితో ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది జూన్ 15వ తేదీన రాత్రివేళ వాస్తవాధీన రేఖ సమీపంలో గల గాల్వన్ వ్యాలీలో భారత జవాన్లు.. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల మధ్య సంభవించిన ఈ ఘర్షణలు రక్తసిక్తమయ్యాయి. సూర్యాపేట్కు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది ఈ ఘర్షణల్లో వీరమరణం పొందారు. ఒకవంక చర్చలు కొనసాగిస్తూనే మరోవంక దాడులకు పాల్పడిన చైనా దురాగతాన్ని భారత్ ఎండగట్టింది. ఆ దేశానికి చెందిన యాప్లన్నింటినీ నిషేధించింది.
బ్రిటన్ వెళ్లాలంటే ఇంకో నెల ఆగాల్సిందే: కరోనా ఆంక్షల ఎత్తివేత మరింత ఆలస్యం
ఈ ప్రాణాంతక ఘర్షణలకు ఏడాది పూర్తయిన సందర్భంగా దేశం యావత్తూ కల్నల్ సంతోష్ బాబు త్యాగనిరతిని స్మరించుకుంటోంది. ఈ ఘర్షణల్లో మరణించిన అమర జవాన్లకు కన్నీటి నివాళి అర్పిస్తోంది. భారత భూభాగంపైకి చైనా జవాన్లు అడుగు పెట్టనివ్వకుండా వారిని నిలువరించడంలో తెగవను ప్రదర్శించారు. అసమాన ధైర్య సాహసాలను కనపరిచారు. చైనా సైనికులు సంతోష్ బాబును తోసివేయడంతో లోయలో పడ్డారు. దీనితో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి సైనికులు ఆయనను ఆర్మీ క్యాంప్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘర్షణల్లో అమరుడైన సంతోష్బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర అవార్డును ప్రకటించింది.
Recommended Video
ఆయన స్మృతిగా స్వస్థలం సూర్యాపేట్లో తెలంగాణ ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో సంతోష్ బాబు నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించింది. దీని ఎత్తు తొమ్మిది అడుగులు. సూర్యాపేట్ కోర్టు చౌరస్తా పార్కులో దీన్ని నెలకొల్పింది. ఈ విగ్రహాన్ని ఈ మధ్యాహ్నం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం సూర్యాపేట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆయన నకిరేకల్ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజలో పాల్గొంటారు.