డ్రగ్స్ పేరిట ఆన్లైన్ ప్రకటనలతో మోసం: కామెరూన్ దేశస్తుడి అరెస్ట్
హైదరాబాద్: నిషేధిత డ్రగ్స్ అంటూ ప్రకటనలు ఇచ్చి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఓ కామెరూన్ దేశస్తుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సైబర్ క్రైం ఏసిపి జయరాం వివరాలను వెల్లడించారు. కామెరూన్ దేశానికి చెందిన ఎల్వీస్ నాన్యూ యామ్సీ(28) విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేందుకు అలవాటుపడ్డాడు.
2013లో హైదరాబాద్కు వచ్చిన ఎల్వీస్ నార్సింగి ప్రాంతంలో అత్యంత ఖరీదైన ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నాడు. నిషేధిత డ్రగ్స్ను ఆన్లైన్లో విక్రయిస్తానని ఇండియామార్ట్.కామ్ వెబ్సైట్లో లాగిన్ అయ్యాడు. అందులో ఈ డ్రగ్స్కు సంబంధించి వాణిజ్య ప్రకటనలను గుప్పించాడు.
ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాల యువతను ఆకర్షించి వారికి తెలిసిన డ్రగ్స్ పేర్లతో భారీగా నగదును వసూలు చేసేందుకు కార్యాచరణను రూపొందించుకున్నాడు. మన దేశ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎల్వీస్ ఇంటా.ప్లస్@జిమెయిల్.కామ్ పేరుతో ఇండియా మార్ట్ వెబ్సైట్లో లాగిన్ చేసుకున్నాడు.
ఈ వ్యవహారాలను గమనిస్తున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అతని ల్యాప్టాప్ , సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా, ఎల్వీస్ డ్రగ్స్ బండారం బయటపడిందని పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ లేకున్నా వాటిని విక్రయిస్తానని చెప్పి మోసానికి పాల్పడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.