Operation Huzurabad: ఈటలపై గంగుల అస్త్రం.. మాజీ మంత్రి శిబిరంలో అలజడి.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్
టీఆర్ఎస్ 'ఆపరేషన్ హుజురాబాద్'పై మాజీ మంత్రి ఈటల ఫైర్ అయ్యారు. ప్రలోభాలతో,బ్లాక్మెయిలింగ్ రాజకీయాలతో స్థానిక ప్రజా ప్రతినిధులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేసినట్లుగా టీఆర్ఎస్ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గంపై పడుతున్నారని విమర్శించారు. 20 ఏళ్లుగా కలిసివున్న తమను తల్లీ బిడ్డను వేరు చేసినట్లుగా చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రలోభాలను,బ్లాక్మెయిలింగ్ రాజకీయాలను హుజురాబాద్ ప్రజలు పాతరేస్తారని... తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈటల వర్గంలో అలజడి...
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత పార్టీలకు అతీతంగా పలువురు నేతలతో ఈటల వరుస భేటీలు జరుపుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ ముందు వరకు పలువురు నేతలు ఈటల నివాసానికే వెళ్లి మంతనాలు జరపగా... లాక్డౌన్ తర్వాత స్వయంగా ఈటలే పలువురు నేతల వద్దకు వెళ్లి కలుస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ తమ పూర్తి ఫోకస్ను హుజురాబాద్పై పెట్టింది.మంత్రి గంగుల కమలాకర్ను ఇన్చార్జిగా నియమించి స్థానిక ప్రజా ప్రతినిధులను,టీఆర్ఎస్ శ్రేణులను ఈటలకు దూరం చేసే ఎత్తుగడలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే హుజురాబాద్లో మకాం పెట్టిన గంగుల మంత్రులు కేటీఆర్,హరీశ్ రావు సలహాలు,సూచనలతో చకచకా పావులు కదుపుతున్నారు. దీంతో ఈటల వర్గంలో అలజడి మొదలైంది.

మారిన రాజకీయం... ఈటల అలర్ట్...
మంత్రి గంగుల హుజురాబాద్ రాకతో రాజకీయం మారుతోంది. నిన్న మొన్నటిదాకా ఈటల వెంటే అన్న నేతలు సైతం టీఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటల అప్రమత్తయ్యారు. నియోజకవర్గంలో తనకున్న రాజకీయ సంబంధాలను,ఇమేజ్ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం(మే 17) మీడియా ముందుకు వచ్చి.. మీకు అండగా నేనున్నానంటూ స్థానిక నేతలకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడొచ్చి హుజురాబాద్లో రాజకీయం చేస్తున్నవారు గతంలో ఇక్కడ ఏ ఎంపీటీసీని గానీ సర్పంచ్ గానీ గెలిపించిన చరిత్ర ఉందా అని ఈటల ప్రశ్నించారు. 'నీకు స్కూల్ ఉంది కదా... మాతో రాకపోతే నీ స్కూల్ మూసేస్తాం... నీకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాలి కదా... మాకు సహకరించే నీకు బిల్లులు రాకుండా చేస్తాం...' అని సర్పంచులను,స్థానిక నేతలను టీఆర్ఎస్ నేతలు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఈటల ఆరోపించారు.

ఆ సీన్ రిపీట్ అవుతుంది... : ఈటల
టీఆర్ఎస్కు సహకరించకపోతే గతంలో హుజురాబాద్,జమ్మికుంటలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను రాకుండా చేస్తామని స్థానిక నేతలను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఈటల ఆరోపించారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న సంగతి గుర్తెరగాలని ఈటల హెచ్చరించారు. టీఆర్ఎస్ ఇదే రీతిలో ముందుకు వెళ్తే 2006 నాటి సీన్ రిపీట్ అవుతుందన్నారు. ఆనాడు కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా బరిలో దిగిన నాడు కనీసం పోలింగ్ బూత్లో తమకు ఏజెంట్లు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. కానీ తెలంగాణ వాదాన్ని గెలిపించేందుకు బొగ్గు గని కార్మికులు,ప్రైవేట్ ఉద్యోగులు,నిరుద్యోగ యువత ఇలా అన్ని వర్గాలు వారు కదిలి వచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు హుజురాబాద్ విషయంలోనూ అదే జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తనకు అండగా కదులుతారని ధీమా వ్యక్తం చేశారు. కుల,మతం,పార్టీ,జెండాలకు అతీతంగా ఆత్మగౌరవ బావుటాను ఎగరవేస్తామన్నారు.

ఖబడ్దార్ అంటూ హెచ్చరిక...
హుజురాబాద్ నుంచి తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని... ఇక్కడి ప్రజలకు తానేంటో తెలుసునని ఈటల వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తే హుజురాబాద్ ప్రజలు పాతరేస్తారని... తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 20 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. తాను దేవుళ్లను మొక్కనని,హుజురాబాద్ ప్రజలకే మొక్కుతానని,ధర్మాన్ని,న్యాయాన్ని మొక్కుతానని చెప్పారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ హుజురాబాద్ ప్రజలను కాపాడుకుంటానని స్పష్టం చేశారు. ఖబడ్దార్ అంటూ టీఆర్ఎస్ పార్టీని హెచ్చరించారు. తన మద్దతుదారులంతా సంయమనం కోల్పోకుండా ఉండాలని,ఐక్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. మంత్రి గంగులపై ఈటైన విమర్శలు చేసిన ఈటల... కరీంనగర్లో ఆయన ఎన్ని గుట్టలు మాయం చేశారో,ఎన్ని వందల కోట్లు సంపాదించారో అందరికీ తెలుసన్నారు.












Click it and Unblock the Notifications