ఆపరేషన్ మునుగోడు - బీజేపీకి షాక్ : టీఆర్ఎస్ లోకి ముఖ్యనేతలు..!!
మునుగోడు కేంద్రంగా పొలిటికల్ జంపింగ్స్ పీక్ కు చేరాయి. మునుగోడు ఉప ఎన్నికు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రత్యర్ది పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందు కు పావులు కదుపుతున్నాయి. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ను తమ పార్టీలో చేర్చుకొని బీజేపీ గులాబీ పార్టీకి షాక్ ఇచ్చింది. దీనికి కౌంటర్ గా టీఆర్ఎస్ ఆ పార్టీలోని నేతలను తమ వైపు తిప్పుకోవటం పైన ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా..ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
ఇక, కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన దాసోజు శ్రావణ్ ఇప్పుడు కమలం పార్టికి రాజీనామా చేసారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపిన రాజీనామా లేఖలో పార్టీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేసారు. ప్రజా హితమైన పథకాలు.. నిబద్దత కలిగిన రాజకీయ సిద్దాంతాలతో ప్రజలను మెప్పించటం కంటే మందు మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచటం ద్వారా మునుగోడు ఎన్నికల్లో గెలుపు సాధించాలనుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ తీరుకు నిరసనగా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు దాసోజు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఆయన కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవటానికి ముహూర్తం సిద్దమైంది. ఇదే సమయంలో గతంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణ పోరాటంలో కీలకంగా వ్యవహరించి..ఆ తరువాత తెలంగాణలో రాజ్యాంగబద్ద పదవిలో కొనసాగిన నేత కొద్ది కాలం క్రితం బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ నేతను తిరిగి టీఆర్ఎస్ లోకి రప్పించేందుకు గులాబీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడులో ప్రస్తుతం గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో..అదే వర్గానికి చెందిన ఇతర పార్టీ నేతల పైన ఇప్పుడు టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆ వర్గానికి చెందన ముఖ్య నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న వేళ..పొలిటికల్ జంపింగ్స్ మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ఇస్తున్న వరుస షాక్ లకు బీజేపీ ఏ రకంగా సమాధానం ఇస్తుంనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications