భారీ ఓట్ బ్యాంక్ పై కేసీఆర్ నజర్, గురి కుదిరితే - ఆపరేషన్ అపోజీషన్..!!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అభ్యర్ధుల ప్రటకన మొదలు ఎన్నికల వ్యూహాల వరకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అభ్యర్ధుల ఎంపికపైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసారు. షెడ్యూల్ సమయంలో ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చే అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. ఇక, ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలకు పదును పెడుతున్నారు. ప్రతిపక్షాలను డైలమా లో పడేయటమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది.
కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయాలు
తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రాష్ట్ర ఆవిర్భావం సమయం నుంచి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరో దఫా మూడో సారి సీఎంగా గెలిచేందుకు పావులు కదుపుతున్నారు. ఇందు కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీజేపీ లక్ష్యంగా జాతీయ స్థాయిలో..కాంగ్రెస్ ను దెబ్బ తీసే విధంగా రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కేవలం 20 రోజుల సమయంలోనే కీలక నిర్ణయాలు ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవటమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది. తాజా నిర్ణయాలతో దాదాపు కోటి మంది ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్షాలు వీరికి కొత్తగా హామీలు ఇచ్చే అవకాశం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఓటర్లను ఆకట్టుకొనే ప్రకటనలు
బీఆర్ఎస్ పైన విజయం తమేదనంటూ కొద్ది కాలం క్రితం వరకూ బీజేపీ చెబుతూ వచ్చింది. ఆ పార్టీలో చోటు చేసుకున్న అంర్గత పరిణామాలతో పూర్తిగా వెనుకబడింది. కర్ణాటక తరువాత తమ లక్ష్యంగా తెలంగాణ అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. హైకమాండ్ నేతలు తెలంగాణ పైనే ఫోకస్ చేసారు. మేనిఫెస్టోలో ఆకర్షణీయ హామీల ప్రకటనకు కసరత్తు చేస్తోంది. కేసీఆర్ హామీ ఇచ్చి అమలు చేయని రుణమాఫీని అస్త్రంగా మలచుకోవాలని భావించింది.
ఈ సమయంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. కేవలం నెల రోజుల సమయంలో 12 నిర్ణయాలను ప్రకటించారు. ఇదే సమయంలో ఉద్యోగులకు ఆకట్టుకొనేందుకు పీఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటనకు సిద్దం అవుతున్నారు. దీని ద్వారా పదేళ్ల పాలన పైన సహజంగానే ఏర్పడే ఏంతో కొంత వ్యతిరేకతను అధిగమించి పాజిటివ్ ఓట బ్యాంక్ తో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.

ఆత్మరక్షణలోకి ప్రతిపక్షాలు
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరు మినహా మిగిలిన వారి అభ్యర్ధిత్వాలకు అధికారికంగా ప్రకటించేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారు. పోడు భూముల పట్టాలు, ఆర్టీసీని సర్కారులో విలీనం చేయడం, రైతు రుణమాఫీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు, బీసీలు, మైనార్టీలకు రూ.లక్షసాయం, గృహలక్ష్మి , దివ్యాంగులకు పెన్షన్ పెంపు, గురుకుల విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు, హైదరాబాద్ మెట్రో విస్తరణ నిర్ణయాలు ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేసేలా ఉన్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణమాఫీకి పచ్చజెండా ఊపటంతో రాజకీయంగా పరిస్థితి లో అనుకూలత కనిపిస్తోంది. దీంతో, కేసీఆర్ నిర్ణయాలు మరోసారి అధికారం తెచ్చి పెడతాయని గులాబీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి.












Click it and Unblock the Notifications