Opinion: అప్పుడు రచ్చ-ఇప్పుడు సైలెంట్-ఎవరికీ పట్టని ప్రణీత్ హన్మంత్ బెయిల్ ?
చిన్న పిల్లలపై యూట్యూబ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వీడియో చేసిన ప్రణీత్ హన్మంతు ఎపిసోడ్ అప్పట్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించి చేసిన వ్యాఖ్యల తర్వాత ప్రతీ ఒక్కరూ దీనిపై స్పందించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. అయితే ఇందులో ఎలాంటి తప్పు లేకపోయినా ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించిన వ్యవహారంపై మాత్రం ఎవరూ నోరు విప్పేందుకు సాహసించలేదు.
వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు లైవ్ సెషన్లో చేసిన వ్యాఖ్యలకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన్ను బెంగుళూరులో అరెస్టు చేశారు. అయితే తాజాగా ఆగస్టు 13న హన్మంతుకు బెయిల్ దొరికింది. కొన్ని షరతులతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే రెండు నెలల పాటు ప్రతీ సోమవారం విచారణాధికారి ముందు హాజరు కావాలని కోర్టు షరతు పెట్టింది. అలాగే ఈ కేసుకు సంబంధించి పోస్టులు పెట్టడం కానీ, స్పందించడం కానీ చేయకూడదు. అలాగే దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. దర్యాప్తు అధికారి అనుమతి లేకుండా హైదరాబాద్ వదిలి వెళ్ల కూడదు.

ఇదంతా ఓ ఎత్తయితే గతంలో ప్రణీత్ హన్మంతు వీడియో చేసినప్పుడు, ఆ తర్వాత అరెస్టు అయ్యే వరకూ స్పందించిన వారంతా ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత మాత్రం మౌనంగా ఉండిపోవడం విచిత్రంగా కనిపిస్తుంది. అప్పట్లో ఆ వివాదాస్పద వీడియోపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో స్పందించిన వారంతా ఇప్పుడు బెయిల్ వచ్చాక పాజిటివ్ గా స్పందిస్తే ఓ గొడవ, నెగెటివ్ గా స్పందిస్తే మరో గొడవ అనుకున్నారో ఏమో పూర్తి సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో ప్రణీత్ హన్మంతుకు బెయిల్ వచ్చిన వ్యవహారం ఎవరికీ కనీసం వార్త కూడా కాకుండా పోయింది.












Click it and Unblock the Notifications