కెసిఆర్ను కలిసిన పి సుశీల, రూ.41వేల కోట్లిచ్చాం: తెలంగాణకు గడ్కరీ హామీ
హైదరాబాద్: ప్రముఖ గాయని పి సుశీల సోమవారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె సీఎం క్యాంపు కార్యాలయంలో కెసిఆర్ కుటుంబ సభ్యులను కలిశారు. ఐదు రోజులపాటు అయుత చండీ యాగాన్ని నిర్వహించినందుకు కెసిఆర్ను సుశీల అభినందించారు.
ప్రజల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. పి సుశీల దేశం గర్వించదగ్గ గాయని అని కొనియాడారు. సుశీలకు కెసిఆర్ శాలువా కప్పి అభినందించారు. కెసిఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి సుశీల ఫోటోలు దిగారు.
తెలంగాణకు రూ.41వేల కోట్లు
తెలంగాణలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ.41వేల కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్ - బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలకు రూ.16వేల కోట్లు కేటాయించామన్నారు.

హైదరాబాదులో జల రవాణా వ్యవస్థకు నావిగేషన్ రిపోర్టు ఇవ్వమని చెప్పామన్నారు. ఈ జల రవాణా వ్యవస్థ ద్వారా జాతీయ రహదారి, ఎయిర్ వే, రైల్వే కనెక్టివిటీల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. జల రవాణాకు ఇంటర్నేషనల్ ట్రాన్సుపోర్ట్ హబ్ తెచ్చే యోచన చేస్తున్నామన్నారు.
కెసిఆర్తో గడ్కరీ భేటీ
తెలంగాణ సీఎం కెసిఆర్, కేంద్రమంత్రి నిదిన్ గడ్కరీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గోదావరి నది పైన నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల గురించి కెసిఆర్ కేంద్రమంత్రికి వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని గడ్కరీ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications