పద్మశ్రీ: స్కూల్ డ్రాపౌట్, ఎవరీ చింతకింది మల్లేషం?
చింతకింది మల్లేషానికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అతనో స్కూల్ డ్రాపౌట్. చేనేత యంత్రాన్ని కనుక్కున్నందుకు అతన్నీ పౌర పురస్కారం వరించింది.
హైదరాబాద్: చింతకింది మల్లేషం అనే వ్యక్తికి పద్మశ్రీ అవార్డు లభించింది. చేనేతకు సంబంధించిన యంత్రాన్ని కనిపెట్టినందుకు ఆయన్ను ఈ అవార్డు వరించింది. ఆయనెవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. అతనో స్కూల్ డ్రాపౌట్. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని శారాజీపేట చెందిన చింతికింది మల్లేషం పేరు చేనేత కార్మికుల్లో తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల నుంచి వీరికి పద్మ అవార్డులు
ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టు 9వేల సార్లు అటూ ఇటూ తిప్పాల్సి ఉంటుంది. ఆ రకంగా రోజుకి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే రెండు చీరలను మాత్రమే నేయగలుగుతారు. రోజుకు రెండు చీరెలు నేస్తే కార్మికుడికి గిట్టుబాటు అవుతుంది. దారాన్ని కండెల చుట్టూ తిప్పుతుంటే మల్లేషం తల్లి చేతులు లాగుతూ ఉండేవి. అమ్మ వేదన చూడలేకపోయాడతను. అదే అతని మెదడును తొలుస్తూ వచ్చింది. అదే ఆసు యంత్రాన్ని తయారు చేయడానికి అతన్ని పురికొల్పింది.
తాను రూపొందించిన యంత్రానికి అమ్మ పేరుమీదనే లక్ష్మీ ఆసుయత్రం అని పేరు పెట్టాడు. అతను తయారు చేసిన యంత్రానికి రెండు తక్కవ కెపాసిటీ గల మోటర్లు, వుడ్ ఫ్రేమ్. దాంతో శ్రమ లేకుండా ఆసు పోయవచ్చు. రోజుకు రెండు చీరలు నేసేవాళ్లు ఈ యంత్రం వచ్చిన తర్వాత ఆరు నుంచి ఏడు చీరలు నేస్తున్నారు.
2011 సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. అదే సంవత్సరం చివరలో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు చోటు చేసుకుంది. 2011లో ఆసుయంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు వచ్చింది. 2017 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం చింతకింది మల్లేశాన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించనుంది. గతంలో నాటి రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్తోపాటు పలువురు ప్రముఖుల పలు అవార్డులు అందుకున్నాడు. మల్లేశం ప్రస్తుతం ఆలేరులో చేనేతవృత్తిలో కొనసాగుతూ ఆలేరు మండల సిల్క్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.