పంచాయతీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు: రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మెన్ రాజేషం గౌడ్
హైదరాబాదు: రాష్ట్ర ఆర్థిక సంఘం ముఖ్యకార్యదర్శితో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రాజేషం గౌడ్ కలిసి 2014-15 నుంచి 2017-18 వరకు రాష్ట్ర ఆర్థిక నిధులు వివిధ శాఖల ద్వారా పన్నులు మరియు పన్నేతర ఆదాయ వివరాలపై సమీక్ష నిర్వహించారు. 2014-15 సంవత్సరంలో జరిగిన పనుల ద్వారా రూ. 6,446.82 కోట్లు వచ్చాయని, 2015-16 స౦వత్సరానికి రూ.14,414.36 కోట్లు , 2016-17 స౦వత్సరానికి రూ.9,781.71 కోట్లు, 2017-18 స౦వత్సరానికి రూ.65.99 కోట్ల పన్నుల ఆదాయము సమకూర్చడం జరిగిందని రాజేషం గౌడ్ తెలిపారు.
ఇక పంచాయతీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని రాజేషం గౌడ్ తెలిపారు. పంచాయతీలకు కేసీఆర్ రూ.1500 కోట్ల నిధులు కేటాయించేందుకు నిర్ణయించుకున్నారని వెల్లడించారు. ఈ నిధులను రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి కేటాయించబడుతాయని రాజేషం గౌడ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైన సర్పంచులతో అవగాహన సదస్సులు నిర్వహించి ఆయా పంచాయతీలకు కావాల్సిన నిధులు సమకూర్చడం జరుగుతుందని చెప్పారు. ఇతర శాఖల ద్వారా స్థానిక సంస్థలకు రావలసిన బకాయిల గురించి ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆ బకాయిలను పంచాయతీలకు చేరేవిధంగా ఆర్థిక సంఘం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఆర్థిక సంఘం ఇప్పటికే ఢిల్లీ , మహారాష్ట్ర ,కర్ణాటక, రాష్ట్రాల పర్యటన చేసి అక్కడ స్థానిక సంస్థల ఆర్థిక వనరులు, సేవలు తదితర విషయాలను పరిశీలించినట్లు చెప్పారు. ఈ ఏడాది అంటే 2019లో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటన చేసేందుకు ఆర్థిక సంఘం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో కూడా చైర్మెన్లు, ఛైర్ పర్సన్లు, సీఈఓ, జెడ్.పి.పి లతో మేయర్లు, మరియు మునిసిపల్ కమిషనర్లతో సమావేశంను నిర్వహించి ఆయా స్థానిక సంస్థల బలోపేతానికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మెన్ జి.రాజేశం గౌడ్ వివరించారు.