ఆహారం మానేస్తా: పరిపూర్ణానంద, 'జంతువులా ప్రవర్తించే మహేష్ కత్తి ఏపీకీ వద్దు'
హైదరాబాద్/విజయవాడ: తన రక్షణపై పోలీసులకు అభిమానం ఉంటే తన యాత్రను అడ్డుకుంటున్న వారిని అరెస్టు చేయాలని శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి సోమవారం అన్నారు. మంచిచేసే వారికి మార్గం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంచిపై దాడి చేసే వారిని కాపాడాలన్నారు. శాంతియుతంగా జరిపే యాత్రకు పోలీసులు దగ్గరుండే ఏర్పాట్లు చేయాలన్నారు. తన ఇంటి వద్ద వందలాది మంది పోలీసులు అవసరం లేదని చెప్పారు.
నాతో పాటు వందమంది యాత్ర చేసేందుకు మీకు ఇబ్బంది ఉంటే తనకు ఒక్కడికే అనుమతి ఇవ్వాలని కోరారు. తన వ్యక్తిత్వంపై ఏ మాత్రం అభిమానం ఉన్నా నా పాదయాత్రకు అనుమతివ్వాలన్నారు. హిందూ సమాజం ప్రతినిధిగా తాను ఒక్కడినే పాదయాత్ర చేస్తానని చెప్పారు. మా యాత్రపై ఎవరో దాడి చేస్తారని అడ్డుకోవడం సరికాదన్నారు.
అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడి చేస్తారనే కారణంతో అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులను అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. పోలీసులు ఇలాగే ఇబ్బంది పెడితే తాను ఆహారం తీసుకోవడం మానేస్తానని హెచ్చరించారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు: కిషన్ రెడ్డి
దేశంలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిపూర్ణానంద స్వామి గృహ నిర్బంధాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పాలన్నారు.
ఏపీ బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
రామునిపై వ్యాఖ్యలు చేసిన మహేష్ కత్తిపై ఏపీలో బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అతను జంతువులా వ్యవహరిస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కులం అడ్డు పెట్టుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కత్తి మహేష్ను ఏపీ నుంచి కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిపూర్ణానందస్వామి యాత్రను అడ్డుకోవడం సరికాదన్నారు.