పాత ప్రసంగం! పరిపూర్ణానందస్వామి నగర బహిష్కరణ: 'ఇదో బ్లాక్ డే'
Recommended Video

హైదరాబాద్: శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామిపై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. గత ఏడాది నవంబర్ నెలలో జరిగిన రాష్ట్రీయ హిందూ సేవ సమావేశంలో పరిపూర్ణానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను బహిష్కరణ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమతి లేనిది హైదరాబాద్ రావొద్దని పేర్కొన్నారు.
దీంతో స్వామిని హైదరాబాద్ నుంచి తరలించారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని కించపరిచేలా, రెచ్చగొట్టేలా వివాదాస్పద సినీ విమర్శకుడు మహేష్ కత్తి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా పరిపూర్ణానంద స్వామి బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

గత ఏడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ
మహేష్ కత్తి వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అతనిని నగరం నుంచి ఆరు నెలల పాటు బహిష్కరించారు. అతని వ్యాఖ్యలను నిరసిస్తూ యాత్ర చేపడతానన్న పరిపూర్ణానందను పోలీసులు రెండు రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేశారు. తదుపరి కార్యాచరణ కోసం ఆయన పలువురితో చర్చలు జరిపారు. ఆయన హౌస్ అరెస్టును బీజేపీ నేతలు, హిందూ ధార్మిక సంఘాలు ఖండించాయి. ఇప్పుడు స్వామిపై చర్యల కోసం గత ఏడాదికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇద్దరిని నగర బహిష్కరణ చేశారు.

ముందుగా నోటీసులు, తరలింపు
ముందుగా పరిపూర్ణానంద స్వామికి నోటీసులు ఇచ్చిన పోలీసులు, బుధవారం తెల్లవారుజామున నగరం నుంచి తరలించారు. ఆయనను తరలించడంలో పోలీసులు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించినట్లుగా తెలుస్తోంది. కొన్ని వాహనాలను ఓవైపు, మరికొన్ని వాహనాలను మరోవైపు పంపించినట్లుగా తెలుస్తోంది. ఆయనను కాకినాడ లేద శ్రీశైలం తీసుకు వెళ్లనున్నారని తెలుస్తోంది.

నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు
నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడం వల్లే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరిపూర్ణానంద స్వామికి నగర బహిష్కరణ నోటీసులు అందినట్లు న్యాయసలహాదారు కూడా ధృవీకరించారు. న్యాయం, ధర్మం రెండు కళ్లుగా భావిస్తూ జీవిస్తున్నానని, ధర్మాన్ని న్యాయం నిలబెడుతుందన్న నమ్మకం తనకు ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని పరిపూర్ణానంద వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

ఇదో బ్లాక్ డే
స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణను బజరంగ్ దళ్ బ్లాక్ డేగా అభివర్ణించింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతామంటే హౌస్ అరెస్టు చేసి, నగర బహిష్కరణ విధించడం దారుణం అన్నారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications