కుల సంఘాలను నమ్ముకున్న అదికార పార్టీ..! ఓట్లు వేస్తారా..? చీల్చుతారా..?
హైదరాబాద్ : తెలంగాణ లో గులాబీ పార్టీ మళ్లీ అదికారం లోకి రావడానికి కులసంఘాల పైన భారం మోపుతోంది. వివిధ కుల సంఘాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే ఓట్లు వేస్తాయని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఆయా కుల సంఘాల నాయకుల, మంత్రుల సహకారాన్ని తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి తలసాని, ఎంపి బూర నర్సయ్య గౌడ్, గుండు సుధారాణి, మహామూద్ ఆలీ, కడియం శ్రీహరి తదితర నాయకులను కులసంఘాల నేతలతో చర్చలు జరపాల్సిందిగా గులాబీ బాస్ చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో కులాల ఓటు బ్యాంక్..! పెట్టాలి ప్రతిపక్షాలకు చెక్..!
టీఆర్ఎస్ తన పాలనలో కుల వృత్తులవారి సంక్షేమం కోసం చేపట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందినవారిని ఓటు బ్యాంక్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నదని సమాచారం. ఇందుకోసం ఆయా కుల సంఘాల నేతలను ప్రచారకర్తలుగా రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తోంది. వీరిలోకులాల ఓటర్లను బాగా ప్రభావితం చేసేవారిని ఎంపిక చేసిందని సమాచారం. అభ్యర్థుల ప్రచార సభలను చేపడుతూనే, అదే సమయంలో కుల సంఘాల నేతలతో సమావేశమయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల జనాభా 80 శాతం ఉంది. వీరిలో సగానికి పైగా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు.

కుల సంఘాలను ఆకర్శించేందుకు రంగంలోకి దిగిన గులాబీ నేతలు..!!
అందుకే బీసీలను ఓటు బ్యాంక్గా మార్చుకునేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు పరిచింది. బీసీలలో ప్రధాన వర్గాలన్నీ ఆర్థిక సహకార సంస్థల ద్వారా లబ్ధిపొందినవైవుంటాయి. కాగా బీసీలలో అత్యంత వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంబిసి కార్పొరేషన్ను ఏర్పాటుచేయడంతోపాలు వెయ్యి కోట్లు కేటాయించింది. అలాగే బీసీలకే చెందిన గొల్ల, కుర్మల కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ముదిరాజ్ల సంక్షేమం కోసం చేపల పిల్లల పంపిణీ, చేనేత కార్మికులను ఆదుకునేందుకు 50 శాతం సబ్సిడీతో ముడి సరుకులు కూడా పంపిణీ చేసింది.

కులసంఘాలపై గంపెడు ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్..!
అలాగే గీత కార్మికుల సంక్షేమానికి ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు చేయడంతోపాటు కల్లు దుకాణాల లైసెన్స్ల కాలపరిమితి ఐదు నుంచి 10 సంవత్సరాలకు పెంచింది. దీనికితోడు హైదరాబాద్ నగరంలో కల్లు దుకాణాల పునరుద్ధరణను చేపట్టింది. ఈ నేపధ్యంలో కుల వృత్తుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజానీకం జనాభా కోటిన్నర ఉంటుందని టీఆర్ఎస్ నేతలు అంచనావేస్తున్నారు. అందుకే ఈ వర్గాలను ఓటు బ్యాంక్గా మార్చుకునే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల్లో కులసంఘాల ప్రభావం ఉంటుందా..? ఏ పార్టీకి అనుకూలం..!!
యాదవ సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకోవడానికి మంత్రి తలసాని, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. మైనార్టీవర్గాలను ఆకట్టుకునేందుకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధీన్ ప్రచారంబరిలో దిగినట్టు సమాచారం. అలాగే ముదిరాజ్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎంపీ బండా ప్రకాశ్, గౌడ సామాజిక వర్గాలను ఆకర్షించేందుకు ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. చేనేత కర్మికుల ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలను ఆకట్టుకునుందుకు ఎంబిసి చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇలా టీఆర్ఎస్ కుల సంఘాలను ఆకట్టుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో కుల ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications