పవన్ పోటీ తప్పు కాదు, కవిత కోసమే: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తున్న జలగ అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నారు. చినజీయర్ స్వామి దృష్టిలో కేసీఆర్ జాతిపిత అయితే కొండా లక్ష్మణ్బాపూజీ, శ్రీకాంతాచారి ఏం కావాలని ప్రశ్నించారు. కేసీఆర్ జాతిపిత కాదని, ఆయనో పెద్ద జలగ అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
కెసిఆర్కు చినజీయర్స్వామి ఇచ్చిన బిరుదును వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. పదవులు పంచుకోవడానికి, ప్రజలపై పన్నులు వేయడానికే నిన్నటి తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగిందని ఆరోపించారు. వస్త్రవ్యాపారులు పోరాడి సాధించుకున్న హక్కును నిన్నటి మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ రద్దు చేశారన్నారు. వస్త్రాలపై పన్ను వేయడం దుర్మార్గమని రేవంత్ అన్నారు.

ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు ప్రశ్నించారని, కానీ కూతురు పదవి కోసం తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. ఏపీ బ్రాహ్మణులను ఆడంబరులు అన్న కేసీఆర్.. తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన చినజీయర్ స్వామిని తెలంగాణపై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ చెప్పడంలో తప్పులేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చని అన్నారు.
రైతుల ఆత్మహత్యలు, కరువు, నీటి ఎద్దడి, అవినీతిపై అసెంబ్లీలో గళం విప్పుతానని ఎమ్మెల్యే రేవంత్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే గవర్నర్ ప్రసంగంపై నిరసన తెలుపుతామని ఆయన తెలిపారు. అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పోరాడలేక కాడి కిందపడేసిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని రేవంత్రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications