జిహెచ్ఎంసి: మాగంటి గోపీనాథ్కు పవన్ కళ్యాణ్ ఫోన్, టికెట్ కోసం సిఫార్సు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్కు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ డివిజన్ టికెట్ సుభాష్రెడ్డికి ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలిసింది. కానీ, ఈ డివిజన్ టికెట్ను బిజెపికి కేటాయించామని పవన్కు మాగంటి గోపీనాథ్ చెప్పినట్లు తెలిసింది.
కాగా, జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమ తరఫున ప్రచారం చేయాలని టిడిపి, బిజెపి నాయకులు పవన్ కళ్యాణ్ను కోరారు. అందుకు ఆయన మందుకు వస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది. ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు.
కాగా, జిహెచ్ఎంసి ఎన్నికల్లో మూడో రోజు శనివారం రికార్డు స్థాయిలో 1003 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు 1097 నామినేషన్లు దాఖలయ్యాయి. 14 డివిజన్లలో నామినేషన్లు దాఖలా కాలేదు. లింగోజిగుడాలో రికార్డు స్థాయిలో 32 నామినేషన్లు దాఖలయ్యాయి.
శనివారం మంచి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద యెత్తున నామినేషన్లు వేశారు. తెరాస 277, బిజెపి 93, టిడిపి 187, కాంగ్రెస్ 200, స్వతంత్ర అభ్యర్థులు 249 నామినేషన్లు దాఖలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.