ఎన్ని వ్యూహాలైనా వేసుకోండి.. నాపేరు పవన్ కళ్యాణే కాదు: కేసీఆర్తో చర్చపై జనసేనాని
గుంటూరు: తాను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో మాట్లాడితే ఏవోవో అంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతం జరిగిన సభలో మాట్లాడారు.

వారి వ్యూహానికి ప్రతి వ్యూహం వేయకుంటే నా పేరు పవన్ కాదు
ఇటీవల (రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ ఎట్ హోం) తెలంగాణకు నేతలతో తాను మాట్లాడితే ఏవోవో మాట్లాడుతున్నారని, తనకు పోరాటం చేసే వాళ్లన్నా, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులన్నా గౌరవమని చెప్పారు. అంతే తప్ప ఏ రోజూ కూడా ఏపీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని అన్నారు. ఈ రాజకీయ క్షేత్రంలో ఎవ్వరూ మనల్ని ఎదగనివ్వరని, జనసేనను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఎన్ని వ్యూహాలు వేస్తారో వేసుకోండని, అందుకు ప్రతి వ్యూహాలు వేయకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదన్నారు. జనసేనని తొక్కేసేందుకు, చంపేసేందుకు, సమూలంగా నాశనం చేసేందుకు వ్యూహాలు వేస్తారని, వారి ప్రతీ వ్యూహానికి నేనో ప్రతి వ్యూహం వేస్తా అన్నారు.

బురదలోకి దిగాల్సిందే
ఒక మహిళ బయటకు వెళ్తే ఇంట్లో వాళ్లు ఆమెకు భద్రత ఉందని భావించే రోజు రావాలని జనసేన కోరుకుంటోందని చెప్పారు. 2019లో జరిగే త్రిముఖ పోరులో జనసేనదే విజయమన్నారు. తానేమీ అన్నా హజారేలా జెండా పట్టుకుని అంతా మంచే జరగాలని కోరుకోవడం లేదని, అవినీతితో నిండిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే బురదలోకి దిగాల్సిందేనని చెప్పారు.

నమస్కారం పెట్టినా ఆ పార్టీలో కలిశారంటున్నారు
ఒక నాయకుడికి నమస్కారం పెడితే ఆ పార్టీతో కలిసిపోయామని ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తాను ఏం చేయాలనుకున్నా అది ప్రజలకు చెప్పే చేస్తానని, ప్రజలకు అండగా ఉంటానని, మీరంతా నాకు అండగా ఉండాలని చెప్పారు. నేనూ చదువుకుని వచ్చిన వాడినేనని, వ్యూహాలను రూపొందించగలనని, అమరావతిని స్వాధీన పరుచుకుంటామని, అమరావతిలో జెండా పాతుతామని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications