'జేడీఎస్ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం, అక్కడ 18 స్థానాలు లక్ష్యం'
హైదరాబాద్/బెంగళూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు 2018లో జేడీఎస్ తరఫున పలు ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు జేడీఎస్ నేత వెల్లడించారు. ఉత్తర కర్నాటకలో పవన్ ప్రచారం చేస్తారని వెల్లడించారు.
తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్, ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వారు చాలామంది ఉన్నారు. ఈ ప్రాంతంలో కనీసం 18 స్థానాలు గెలవడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే స్టార్ కంపెయినర్లుగా హీరో నిఖిల్, హీరోయిన్ పూజాగాంధీ పేర్లు ప్రకటించామని, వారు ఉత్తర కర్నాటకలో ప్రచారం చేస్తారని చెప్పారు.
కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చిరంజీవి ప్రచారం చేయనున్నారు. మరోవైపు, కర్నాటక తెలుగు ప్రజలు జేడీఎస్కు ఓటు వేయాలని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ప్రకటన చేశారు.
5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా
కర్నాటకలో రాబోయే అయిదేళ్లలో కోటి ఉద్యోగాలను సృష్టిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తెలిపారు. వ్యవసాయ రంగంపై రూ.1.25 లక్షల కోట్లు వెచ్చిస్తామన్నారు. ప్రధాని తన మన్ కీ బాత్ను ప్రజలు వినాలని కోరుకుంటారని, తామ మాత్రం కర్నాటక ప్రజల మనసులోని మాటను మేనిఫెస్టోలో చేర్చామన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు.