త్యాగధనుల స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా: పవన్ కల్యాణ్
హైదరాబాద్: వ్యక్తులు, పార్టీల కన్నా దేశం, సమాజం ఎంతో ముఖ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Recommended Video
స్వాతంత్ర్య సాధన కోసంం ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారని, అలాంటి త్యాగధనుల స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. విడిపోవాలనుకోవడానికి మనుషులకు ఎన్నో కారణాలు ఉంటాయని, జాతి సమైక్యంగా ఉండాలనే స్ఫూర్తి గణ తంత్ర దినోత్సవం గుర్తు చేస్తుందని ఆయన అన్నారు.
మరింత మందికి ఇచ్చి ఉంటే..
పద్మ అవార్డులు పొందిన ఇళయరాజా, కిడాంబి శ్రీకాంత్లకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. మరింత మంది తెలుగువారికి అవార్డులు ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. అలనాటి మేటి నటి సావిత్రికి, మహానటుడు ఎస్వీ రంగారావుకు అవార్డులను ప్రకటించాలని ఆయన కోరారు. ఇందుకు కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆయన కోరారు.
ఇక అనంతపురంలో పర్యటన..
ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. చలోరే.. చలోరే.. చల్ కార్యక్రమంలో భాగంగా ఆయన అనంతపురం జిల్లాలో కరవుపై అధ్యయనం, అవగాహన కోసం వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.
జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన
శనివారం ఉదయం పవన్ కల్యాణ్ అనంతపురం చేరుకుంటారు. ఆ తర్వాత అనంతపురంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం జనసేన ప్రజా వేదికలో సీమ కరువుకు పరిష్కార మార్గాలు అనే అంశంపై రైతులు, వ్యవసాయ, నీటి పారుదల రంగాల నిపుణులతో జరిగ చర్చాగోష్టిలో పాల్గొంటారు. దీనికి కేవలం ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత పార్టీ స్థానిక ముఖ్యులను, కార్యకర్తలను కలుసుకుంటారు.
28వ తేదీన పవన్ కల్యాణ్ ఇలా...
ఈ నెల 28వ తేదీ ఉదయం కదిరి చేరుకుని నరసింహస్వామిని దర్శించుకుంటారు. కరువు పరిస్థితులపై అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్తారు. సాయంత్రం పుట్టపర్తి చేరుకుని సత్యసాయి మందిరం, మంచినీటి పథకం, ఆస్పత్రిని సందర్శిస్తారు. రాత్రి అక్కడే బస చేసి 29వ తేదీ ఉదయం ధర్మవరం బయలుదేరి వెళ్తారు. అక్కడ చేనేత కార్మికులతో సమావేశమవుతారు. ఆ తర్వాత హిందూపురం వెళ్లి అక్కడ జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతారు. ఈ సమావేశానికి జిల్లావ్యాప్తంగా జనసేన కార్యకర్తలు హాజరవుతారు.