జనసేన సిద్ధాంతాలు, విధివిధానాలు, లక్ష్యాల కరదీపిక విడుదల
హైదరాబాద్: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. హైదరాబాదు మాదాపూర్లోని పార్టీ కార్యాలయంలో పింగళి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ పూలమాల వేసి, జ్యోతిని వెలిగించి అంజలి ఘటించారు.
ఆ తర్వాత జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు, లక్ష్యాలను తెలియజేసే కరదీపికను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు సిద్ధాంతాలపై అవగాహన కల్పించడంతో పాటు వారికి దిశానిర్దేశనం చేసేలా జనసేన కరదీపికను రూపొందించింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం తదితరులు ఉన్నారు.
వీరమహిళ విభాగం భేటీలో..
జనసేన వీరమహిళ విభాగం భేటీలో పవన్ మాట్లాడుతూ... శిల్పి రాయిలో అనవసర భాగాలు తీసేసి ఒక శిల్పాన్ని చెక్కినట్లుగా, మనలోని చెడును తీసేసి మంచి విధానంతో ముందుకు వెళ్లాలన్నారు. తాను సినిమా ప్రపంచంలోంచి వచ్చినవాడినని, అవే తనను రాజకీయాల్లోకి రాకుండా ఆపలేకపోయాయని, కాబట్టి మీరు విమర్శలకు భయపడద్దన్నారు.
నేను సత్యమేవ జయతేను నమ్ముతానని, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్నారు. నేను దశాబ్దం కాలం ఓటమిని చవి చూసిన వ్యక్తిని అని, ఒక్క రోజులో మార్పు జరగదని, మనందరం ఓపికతో వేచి చూడాలన్నారు. వ్యక్తిగత ఫలితాన్ని ఆశించి కాకుండా సామాజిక మార్పు కోసం పని చేయాలన్నారు. నేను మనుషులను, రూపురేఖలు, వస్త్రధారణలను చూసి అంచనా వేసే మనుషుల స్థాయిని దాటానని చెప్పారు. నా అక్కాచెల్లెళ్లుగా మీకు గౌరవం కల్పించే దిశగా పని చేయించుకుంటానని చెప్పారు.