పవన్ చేతుల మీదుగా ఆవిష్కరించిన జాతీయ జెండా: 20 మంది 20 రోజుల శ్రమ
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ జెండా తయారీ వెనుక మహిళలు ఉన్నారు.
ఫిల్వెక్స్ హాబీ సొసైటీ డెరెక్టర్ పద్మావతి ఈ జెండా తయారీలో తనవంతు పాత్ర పోషించారు. ఆమె చెప్పిన వివరాల మేరకు ఖమ్మం జిల్లాలో ఈ జాతీయ జెండాను తయారు చేశారు. ఇరవై మంది మహిళలు, ఇరవై రోజులకు పైగా శ్రమించి దీనిని కుట్టారు.
సూరత్ నుంచి వచ్చిన మన్నికైన బట్ట
జాతీయ జెండాలో పాలిస్టర్ను ఉపయోగించినట్లు వెల్లడించారు. ఇది చాలా మన్నికైన బట్ట అని చెప్పారు. సూరత్ నుంచి తెప్పించామని వెల్లడించారు. ఈ జెండాను కుట్టేందుకు ఆ ఇరవై మంది మహిళలు ఎంతో అంకితభావంతో కష్టపడ్డారని చెప్పారు.
యువతకు పిలుపు: ప్రపంచంలోనే పెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్
ఇవి ఈ సొసైటీ కుట్టించిన జెండాలే
సంజీవయ్య పార్కులో పెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనిని కూడా ఈ సొసైటీ ఆధ్వర్యంలోనే కుట్టించారు. ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ, గన్నవరం విమానాశ్రయం తదితర చోట్ల ఉన్న జెండాలు ఈ సొసైటీ కుట్టించిన జెండాలే.
వైబ్రాంట్స్ కలాం ఇండియా ఆధ్వర్యంలో
ఎన్టీఆర్ స్టేడియంలో 122 అడుగుల పొడవు, 183 అడుగుల వెడల్పుతో 22,326 చదరపు అడుగుల వైశాల్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. వైబ్రాంట్స్ కలాం ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అదే రోజు జెండా ఆవిష్కరణ
1857లో సిపాయిల తిరుగుబాటు మే 10వ తేదీన జరిగింది. ప్రథమ స్వాతంత్రానికి కారణమైన అదే రోజు మే 10 2018న ఈ అతిపెద్ద జెండాను ఆవిష్కరించారు. కాగా, వైబ్రాంట్స్ కలాం సంస్థ దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆలోచనలను, విజన్ను ప్రచారం చేస్తుంది.