మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై పీసీసీకి అందిన నివేదిక.. వేటు తప్పదా..?
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక అందజేసింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. కొండా సురేఖ పార్టీ నియమావళి ఉల్లంఘించడం ఇది తొలిసారి కాదని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. చిన్నారెడ్డిని కూడా ప్రణాళిక సంఘం ఛైర్మన్ పదవి నుంచి తొలిగించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరిపై నివేదిక సిద్ధం చేసి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అందజేశారు.
ఇక కాంగ్రెస్ కమిటీలో క్రమశిక్షణ ప్రధానమైనదని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీపై గౌరవం ఉంటేనే మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందని.. పార్టీపై నెగెటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ఈ మేరకు నివేదిక సమర్పించిన అనంతరం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గౌరవాన్ని దెబ్బతీసేలా పనులు ఎవరూ చేయొద్దని.. వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడొద్దని తెలిపారు.

'ఈ నివేదికను పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి పీసీసీ చీఫ్ కు అందచేశాం. నివేదికను ఇన్ ఛార్జి మీనాక్షీ నటరాజన్ కు కూడా పంపారు. ఏఐసీసీ చీఫ్, AICC జనరల్ సెక్రెటరీకి కూడా నివేదిక పంపిస్తారు. కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి. లెటర్ లో ఏముందో చెప్తే నాకు నోటీసులు వస్తాయి. మా రిపోర్ట్ లో అన్ని విషయాలు పొందు పరిచాం' అని మల్లు రవి వెల్లడించారు. ఇక కొద్దిసేపట్లో మల్లు రవి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక అందించనున్నారు. ఇక కమిటీ నివేదిక నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications