పెద్దమ్మ తల్లి సాక్షిగా .... లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఈవో
పేరుకి దేవాదాయ శాఖ ఈవో .. కానీ అవినీతిలో ఆయనది అందె వేసిన చెయ్యి . జూబ్లీహిల్స్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెద్దమ్మ టెంపుల్ ఈవో అంజనారెడ్డి పెద్దమ్మ తల్లి సాక్షిగా అవినీతికి పాల్పడ్డారు. ఒక అర్చకుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఒక అర్చకుడు అవినీతి పాల్పడి సస్పెండ్ అయితే ఇక ఆ అర్చకుడినే లంచం డిమాండ్ చేశారు సదరు ఈవో అంజనా రెడ్డి .
కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం .. తెలంగాణలో కేసీఆర్ కు జైలు ఖాయం .. ఎమ్మెల్యే కోమటిరెడ్డి జోస్యం
భక్తుడు ఇచ్చిన విరాళంలో చేతివాటం చూపించి సస్పెండ్ అయిన అర్చకుడు ఆంజనేయ శర్మ
ఇక అసలు విషయానికి వస్తే పెద్దమ్మ టెంపుల్ లో ఎన్నో ఏళ్లుగా తాత్కాలిక అర్చకుడిగా పని చేస్తున్న ప్రయాగ ఆంజనేయ శర్మ 2017 లో ఒక భక్తుడు ఇచ్చిన 50 వేల రూపాయల విరాళాన్ని జనరల్ రసీదులో రూ. 10 వేలుగా రాసి 40 వేలు కాజేశాడు . ఇక ఈ విషయం ఆనోటా, ఈనోటా బయటకు వచ్చి...అప్పటి ఈవో బాలాజీ.. అర్చకుడిని సస్పెండ్ చేశారు. 2014 కంటే ముందు ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయమని సీఎం కేసీఆర్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. వాటి ఆధారంగా అప్పటికే 15 ఏళ్ళ నుంచి పెద్దమ్మగుడిలో అర్చకుడిగా పని చేస్తున్న ఆంజనేయ శర్మను రెగ్యులరైజ్ చేయమని ఉత్తర్వులు వచ్చాయి.
సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ఉద్యోగం రెగ్యులరైజ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పెద్దమ్మ గుడి ఈవో
ఇక ఆంజనేయ శర్మపై సస్పెన్షన్ ఎత్తివేసి, ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చెయ్యాల్సిన బాధ్యత ఈవోపై ఉంది. దీంతో ప్రస్తుత ఈవో అంజనా రెడ్డి ఆంజనేయ శర్మను రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. అంతే కాదు అప్పటికే శర్మ ఖాతాలో జమ అయిన లక్షా 25 వేల రూపాయల వేతనం కూడా తనకే ఇవ్వాలని ఈవో డిమాండ్ చేశారు. చివరికి 4 లక్షల రూపాయల నగదు, బ్యాంకులో జమ అయిన లక్షా 25 వేల రూపాయలు జీతం ఇచ్చేలా ఈవో ఒప్పందం చేసుకున్నారు. అర్చకుడు తన ఉద్యోగం కోసం ఆ మొత్తం ఇవ్వటానికి అంగీకరించాడు .
ఏసీబీ అధికారులను ఆశ్రయించిన అర్చకుడు .. లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు
డబ్బులకు వేధిస్తూ ఇబ్బంది పెడుతున్న ఈవో ప్రవర్తనతో విసిగిపోయిన ఆంజనేయ శర్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మే 7,2019 మధ్యాహ్నం ఈవో అంజనా రెడ్డికి అర్చకుడు లక్ష రూపాయల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈవోని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దేవాలయాల్లో పని చేసే ఉన్నతాధికారులే ఇలా ఉంటే క్రింది స్థాయి సిబ్బంది చేతివాటం చూపించరా మరి అంటున్నారు ఈ ఉదంతం తెలిసిన వారు.