ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధం-గూడ్స్ రైలులో తరలిస్తుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు...
పెద్దపల్లి జిల్లా చీకురాయి వద్ద ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గూడ్స్ రైలు హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్లోని రాయపూర్కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పెద్దపల్లి రైల్వే స్టేషన్కు సమీపంలోని చీకురాయి రైల్వే గేటు వద్దకు చేరుకోగానే ఆక్సిజన్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గూడ్స్ రైలు సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఆపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సకాలంలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను త్వరగానే అదుపులోకి తీసుకొచ్చారు. ఎండ వేడిమి వల్ల లేదా బ్రేక్ వేసిన సమయంలో మంటలు మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పిందని గూడ్స్ రైలు సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కోవిడ్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ కేటాయింపులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్రాలు తమకు కేటాయించిన రాష్ట్రాల్లోని ప్లాంట్ల నుంచి ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ను తెప్పించుకుంటున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లతో రాయపూర్ వెళ్తున్న రైలు అగ్నిప్రమాదానికి గురైంది.
రెండు రోజుల క్రితం ఒడిశాలోని రాయ్గఢ్ స్థానిక రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ వ్యాగన్ నుంచి ఆక్సిజన్ లీకైన ఘటన చోటు చేసుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది... అతి కష్టం మీద లీకేజీని అదుపు చేశారు. ఆ గూడ్స్ రైలు రౌర్కెలా నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా రాయగఢ్ రైల్వే స్టేషన్కు సమీపంలో నిలిచిపోయిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
— oneindiatelugu (@oneindiatelugu) May 29, 2021