పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత మిస్సింగ్... పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు....
పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కనబడటం లేదంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలువురు బీజేపీ,బీజేవైఎం నాయకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫోటో పట్టుకుని పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. రోడ్డుపై వెళ్తున్న ప్రజలకు,షాపుల యజమానులకు ఎంపీ ఫోటో చూపించి ఆయన ఎక్కడైనా కనబడ్డారా అని ప్రశ్నించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన కనిపించినట్లు చెప్పలేదని బీజేపీ నేతలు చెప్పారు.
ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి వచ్చి పోవడమే తప్ప... ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాల్లో చాలా సమస్యలున్నా... దయచేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ను,సీఎం కేసీఆర్ను నోటికొచ్చినట్లు తిట్టిన వెంకటేశ్ నేత... ఇప్పుడదే కేసీఆర్పై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ఎంపీకి ధైర్యం ఉంటే మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాల సమస్యలపై కేసీఆర్తో మాట్లాడాలన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏబీవీపీ కార్యకర్తగా పనిచేస్తూ అంచలంచెలుగా రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారని... అదే వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి టికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. ఇకనైనా మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించి స్థానిక సమస్యల పరిష్కారానికి ఎంపీ వెంకటేశ్ నేత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్రావు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణ, బీజేపీ జిల్లా కార్యదర్శి మల్యాల శ్రీను, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Recommended Video
కాగా,2018 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటేశ్ నేత కాంగ్రెస్ టికెట్పై చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్పై పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మంచిర్యాల జిల్లా కూడా ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రం రోజురోజుకు విస్తరిస్తున్నప్పటికీ... ఇక్కడ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ విఫలమవుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications