అహంకారం పెరగలేదు: పోచారం, ఆ పంటలే వేయాలని రైతులకు
నిజామాబాద్: అధికారంలోకి వచ్చాక తమకు అహంకారం పెరగలేదని, మెజార్టీ పెరిగిందని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నాడు అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు తమ పాలనకు రెఫరెండం అని చెప్పారు. తమకు వరంగల్ జిల్లా ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారన్నారు.
వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలతో ఇంకా తమ ప్రభుత్వ బాధ్యత పెరిగిందని చెప్పారు. 2017 జూన్ వరకు కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా చేపడుతున్నామని తెలిపారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో రాష్ట్రాన్నిసస్యశ్యామలం చేస్తామని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంను పూర్తి చేసి నిజాంసాగర్ ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని అందిస్తామని, 2018 నుంచి రైతులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తామన్నారు.
పంట పొలాల్లో బోర్లు వేసిన రైతులపై కేసులు పెడతామని చెప్పడంలో నిజం లేదన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రబీ సీజన్ రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. డిసెంబర్ 2న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామన్నారు.
రాష్ట్రానికి సాయం అందించాలని కోరుతామన్నారు. పత్తికి మద్దతు ధర కల్పించే విషయమై మాట్లాడుతామన్నారు. తాము నూటికి నూరు శాతం కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు.
విద్యుత్ కొరత ఉండకుండా ప్రాజెక్టులు చేపడతామన్నారు. రైతులకు సాగునీటి కొరత, విద్యుత్ కొరత ఉండదన్నారు. వచ్చే మూడేళ్లలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామన్నారు. కాంగ్రెస్ పాలన వల్లే రైతుల ఆత్మహత్య జరుగుతున్నాయన్నారు.