గాంధీ భవన్ వెలవెల! తెలంగాణ భవన్ కళకళ!!
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఏడాది పాలనలోనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై మనసు విరిగిందని.. మళ్లీ అధికారం కేసీఆర్కే దక్కుతుందని ఓ సర్వే ప్రతినిధి చెప్పినట్లు కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించారు.
నమ్మి వానబోస్తే షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
సూటిగా, సుత్తి లేకుండా సామాన్యుడికి అర్థమయ్యే విధంగా ఈ షార్ట్ ఫిల్మ్లో స్పష్టంగా చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను లేవనెత్తుతాం. ప్రజల తరపున ప్రభుత్వంపై తప్పకుండా పోరాటం చేస్తామన్నారు కేటీఆర్.

మనకు అధికారం మాత్రమే పోయింది.. పోరాట యావ, చేవ పోలేదన్నారు కేటీఆర్. ప్రజల్లో అభిమానం ఏ మాత్రం తగ్గలేదు.. పెరిగింది అని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్తో బీఆర్ఎస్ పార్టీ స్థాపనకు 25 ఏళ్లు పూర్తవుతాయని.. గత ఏడాది పార్టీకి అత్యంత కఠినమైన సమయమని అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీని ఆశ్చర్యకరంగా ఓడించారన్నారు. ఎమ్మెల్సీ కవిత ఐదు నెలలు జైల్లో ఉండటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంవత్సరంలోనే వ్యతిరేకత పెరుగుతోందని.. రైతుల సమస్యలను ఢిల్లీ వరకు తీసుకెళ్లిన విషయాన్ని తెలిపారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో తాజాగా జరిగిన ఒక సర్వే గురించి చెప్పారు. సహజంగా ఏ ప్రభుత్వం మీద అయినా మూడు, నాలుగేళ్ల తర్వాత కోపం వస్తది.. తెలంగాణ ప్రజలకు ఓపిక పట్టే గుణం ఉంది. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏడాదిలోనే మనసు విరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నారో దీన్ని తప్పకుండా కొనసాగించండి.. అధికారం కేసీఆర్కు దక్కుతుందని సర్వే చెప్పిందని కేటీఆర్ తెలిపారు.
గాంధీ భవన్ బోసిపోతుంటే.. తెలంగాణ భవన్ నిత్యం కళకళలాడుతోందన్నారు కేటీఆర్. లగచర్ల గిరిజన ఆడబిడ్డలు అందరూ వచ్చి తమ కుటుంబ సభ్యులను జైలు నుంచి విడిపించాలని కోరారు. వారి విడుదల కోసం లీగల్ సెల్ బృందం కష్టపడి న్యాయ పోరాటం చేస్తున్నారు. గిరిజన రైతులను బయటకు తీసుకొస్తామని ధైర్యం చెప్పాను అని కేటీఆర్ వివరించారు.
LIVE: తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/I9bUxc2rno
— BRS Party (@BRSparty) December 7, 2024
ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు కూడా ఫిర్యాదులు చేశామని కేటీఆర్ తెలిపారు. ఇక మా బకాయిలు ఇప్పించాలని మాజీ సర్పంచ్లు అడిగారు. ఆశా వర్కర్లు మా గురించి అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతున్నారు. ఈ ఒక్కరోజే అందరూ తెలంగాణ భవన్కు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారని కేటీఆర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications