రోహిత్ ఆత్మహత్య: నిఘా వర్గాల హెచ్చరిక, సస్షెన్షన్పై తప్పు పట్టిన కమిటీ
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాయి. విశ్వవిద్యాలయంలో సంభవించిన పరిణామాలపై నిఘా వర్గాలు తాజాగా బుధవారం కేంద్రానికి నివేదిక పంపాయి.
విద్యార్ధుల ఆందోళనలో బయటి నుంచి మద్దతుదారులు పెద్దసంఖ్యలో వచ్చి చేరుతున్నారని, ఆ ముసుగులో సంఘ విద్రోహులు క్యాంప్సలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా అధికారులు కేంద్రానికి వివరించారు. బయటి వ్యక్తులు హెచసీయూలోని ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే కార్యక్రమాలకు పూనుకునే ప్రమాదం ఉందని వారు ప్రస్తావించినట్టు సమాచారం. వీసీ అప్పారావు వ్యవహార శైలిని కూడా అధికారులు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
కాగా, ఐదుగురు దళిత విద్యార్థుల సస్పెన్షన్ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదని కేంద్ర ప్రభుత్వం వేసిన ద్విసభ్య సంఘం సభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యార్థుల సస్పెన్షన్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని చెబుతున్నప్పటికీ సస్పెన్షన్ వ్యవహారంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం అయోమయం సృష్టించిందని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విచారణ నిమిత్తం ద్విసభ్య సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ శనివారంనాడు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు శనివారం నాడు తన నివేదికను సమర్పించనుంది. విద్యార్థుల సస్పెన్షన్ విషయంలో వ్యవహరించిన తీరును కమిటీ తప్పు పట్టినట్లు తెలుస్తోంది. నివేదికను పరిశీలించిన తర్వాత మంత్రిత్వ శాఖ తదుపరి చర్యలు తీసుకుంటుంది.
కాగా, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని విశ్వవిద్యాలయం వీసీ పొదిలె అప్పారావు అంటున్నారు. ఎన్డియె ప్రభుత్వ హయాంలో తన నియామకం జరగడం యాదృచ్ఛికమేనని ఆయన అన్నారు.