భౌతిక దాడి అత్యంత హేయం.!పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టుకెళ్లిన మానవతారాయ్.!
హైదరాబాద్ : మానవతా రాయ్ పై భౌతిక దాడికి పాల్పడిన పోలీస్ లను వెంటనే సస్పెండ్ చేయాలని లేకపోతే శనివారం ఉదయం డీజీపీకి ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్ ని 13వ రాత్రి నాగార్జునసాగర్ లో తన గది తలుపులు పగులగొట్టి పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలతో కలిసి విచక్షణ లేకుండా దాడులకు పాల్పడ్డారని, దాడులకు పాల్పడ్డ పోలీసులను వెంటనే సస్పెండ్ చెయకపోతే శనివారం ఉదయం డీజీపీ కార్యాలయం ముందు దీక్ష చేపడతామని హెచ్చరించారు.
ఇదే అంశం పట్ల తెలంగాణ డీజీపీ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని బక్క జడ్సన్ వివరించారు.మొన్న బోడ సునీల్ నాయక్ కు ఉద్యోగం ఇవ్వకుండా, అయన ఆత్మహత్యకు కారణమైన తెలంగాణ ప్రభుత్వం సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డమాండ్ చేస్తోంది. నేడు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యోగాల నోటిఫికేషన్ వేయడం లేదని యువతను చైతన్య పరుస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నందుకు పోలీసులతో ముఖ్యమంత్రి దాడులు నిర్వహించారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ మెంబెర్ బక్క జడ్సన్ తెలిపారు.
ఇదిలా ఉండగా తనను అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు తలుపు తట్టారు కాంగ్రెస్ నేత మానవత రాయ్. ఎలాంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి, తనపై దాడి చేశారని తన పిటిషన్ లో పేర్కొన్నారు మానవత రాయ్. అక్రమ అరెస్ట్ తో 24 గంటలపాటు తనను నిర్బంధించారని, తనపై దాడి చేసిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని మానవత రాయ్ డిమాండ్ చేస్తున్నారు. తన కేసులో డీజీపీ, మిర్యాలగూడ, నల్గొండ ఎస్పీలతో పాటు, నాగార్జున సాగర్ సీఐ లను ప్రతివాదులుగా చేర్చారు కాంగ్రెస్ నేత మానవత రాయ్.