ఎసిబి కేసు పేరు చెప్పి బ్లాక్ మెయిల్: స్పాట్ పెట్టి పట్టుకున్నారు (పిక్చర్స్)
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కేసు మాఫీ చేయిస్తానని బెదిరించి 30 లక్షలకు టార్గెట్ పెట్టి పది లక్షలతో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. "మీపై ఏసీబీలో ఫిర్యాదు నమోదైంది. నాకు తెలిసిన వ్యక్తి ద్వారా ఆ కేసు మాఫీ చేయిస్తా. రూ.30 లక్షలు ఖర్చవుతుంది" అంటూ ఓ వ్యక్తి తూనికలు- కొలతల శాఖ అధికారిని మోసగించేందుకు ప్రయత్నించాడు.
తూనికలు కొలతల శాఖ అధికారి అధికారి సమయస్ఫూర్తితో వ్యవహరించి మోసగాడిని ఏసీబీకి పట్టించాడు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రామ ఉమామహేశ్వర శర్మ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కోల్కతాకు చెందిన అమిత్ కెతావత్ (45) ఉన్నత విద్యను అభ్యసించాడు. పదేండ్ల కిందట హైదరాబాద్ వచ్చి, కొండాపూర్లోని ఓ అపార్టుమెంట్లో కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు.
తూనికలు - కొలతల శాఖ హైదరాబాద్ జిల్లా ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డికి గతనెల 28న ఫోన్చేసి మీపై ఏసీబీలో ఫిర్యాదు ఉందని చెప్పాడు. ఏసీబీలో తనకు తెలిసిన వారున్నారని, వచ్చి మాట్లాడుకొని ఫిర్యాదు లేకుండా చేసుకోమని సలహా ఇచ్చాడు.

ఫోన్ కాల్తో అప్రమత్తం
అమిత్ ఫోన్కాల్తో అప్రమత్తమైన భాస్కర్రెడ్డి వెంటనే అతడిని సంప్రదించాడు. అమిత్ చూపించిన ఫిర్యాదు పత్రంపై అనుమానం వచ్చిన భాస్కర్రెడ్డి వెంటనే ఈ విషయాన్ని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ దృష్టికి తీసుకువెళ్లాడు. డీజీ ఒక టీమ్ను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు.

మంతనాలు సాగిస్తూనే...
భాస్కర్రెడ్డి మరోవైపు అమిత్తో మంతనాలు సాగిస్తూనే ఉన్నాడు. తనకు రూ. 30 లక్షలు ఇస్తే ఏసీబీ అధికారులతో మాట్లాడి ఫిర్యాదు లేకుండా చేస్తానని అమిత్ డిమాండ్ చేయడంతో, అంత డబ్బు ఇచ్చుకోలేనంటూ భాస్కర్రెడ్డి రూ. 20 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు.

స్పాట్ పెట్టారు..
తొలుత రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఆ డబ్బు తీసుకొనేందుకు బుధవారం సాయంత్రం గచ్చిబౌలిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు వస్తానని అమిత్ సూచించాడు. ఈ విషయాన్ని భాస్కర్రెడ్డి వెంటనే ఏసీబీ అధికారుల సమాచారమిచ్చాడు. దీంతో అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు భాస్కరరెడ్డి నుంచి అమిత్ రూ. 10 లక్షలు తీసుకున్న వెంటనే పట్టుకున్నారు.

చాలా సంస్థల్లో పనిచేశాడు...
అమిత్ గతంలో కేంద్రంలోని పలు సంస్థలలో పనిచేసినట్లు తన ప్రొఫైల్లో రాసుకున్నాడని ఉమామహేశ్వర శర్మ తెలిపారు. అయితే అతని చేష్టలను బట్టి అవన్న్నీ నకిలీవేనని తెలుస్తున్నదని, వీటిని నిర్ధారించాల్సిన అవసరముందని చెప్పారు.

ఎలా సంపాదించాడు..
బాధితుడు భాస్కర్రెడ్డి ఫోన్నెంబర్ను నిందితుడు అమిత్ ఎలా సంపాదించాడు, అతడి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎంత కాలంగా చేస్తున్నాడు వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీలు సునీత, ఇక్బాల్ సిద్దిఖీ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications