మళ్లీ మీసం మెలేసిన రేవంత్ రెడ్డి (పిక్చర్స్)
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో అరెస్టయిన తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మరోసారి మీసం మెలేసారు. ఏసీబీ అరెస్ట్ చేసి తమ కార్యాలయానికి తీసుకుని వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మీసం మెలేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అప్పుడు మీసం మెలేసిన రేవంత్ రెడ్డి కస్టడీ ముగిసిన తర్వాత మంగళవారంనాడు జైలుకు తరలించే సమయంలోనూ మీసం మెలేసారు. కోర్టులో న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించేందుకు బయటకు వచ్చి వాహనంలో ఎక్కిన సమయంలో మీడియా ప్రతినిధులను చూసిన రేవంత్ రెడ్డి మీసం మెలేశారు.
కాగా, రేవంత్ బెయిల్ పిటిషన్పై ఏసీబీ అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించనున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం నమోదు చేయాలని దర్యాప్తు అధికారులు పిటిషన్ వేశారు.

కోర్టుకు రేవంత్ రెడ్డి ఇలా..
నాలుగు రోజుల పోలీసు కస్టడీ గడువు ముగియడంతో నిందితులు ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, సెబాస్టీయన్, ఉదయ్సింహాను ఏసీబీ అధికారులు మంగళవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో ముగ్గురిని చర్లపల్లి జైలుకు తరలించారు.

రేవంత్ రెడ్డి తిరిగి జైలుకు..
ఏసీబీ అధికారులు నాలుగురోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలవరకు విచారించి, ఆ తర్వాత బషీర్బాగ్ సిట్ కార్యాలయానికి పంపించేవారు. కోర్టు ఇచ్చిన విచారణ గడువు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ముగియడంతో గంట ముందే వారిని కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కోర్టు ఆదేశంతో వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.

మీసం మెలేశారు...
కోర్టు భవనం నుంచి ఎస్కార్ట్ పోలీసుల మధ్య బయటకు వచ్చిన రేవంత్రెడ్డి వాహనం ఎక్కే సయయంలో అక్కడున్న మీడియా కెమెరాలను చూస్తూ మీసం మెలేశారు.

న్యాయమూర్తికి ఫిర్యాదు
విచారణ సమయంలో మూడు రాత్రులు సిట్ కార్యాలయంలో ఉన్నామని, నీరు లేదు, బెడ్ షీట్ లేదు, బాత్రూమ్ లేదు, టాయ్లెట్ లేదు.. కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని రేవంత్రెడ్డితో సహా ముగ్గురు నిందితులు న్యాయమూర్తికి విన్నవించారు.

న్యాయమూర్తి ఆదేశాలు
తమకు తగిన సదుపాయాలు కల్పించడం లేదని నిందితులు చేసిన ఫిర్యాదుపై స్పందించిన న్యాయమూర్తి లక్ష్మీపతి, అక్కడే ఉన్న ప్రభుత్వ ప్లీడర్ను వివరణ అడిగారు. ఏసీబీ అధికారుల నుంచి వివరాలు తీసుకొని, కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications