సామాన్యుడికి మరో షాక్: ఉప్పు, చక్కెర కేజీకి రూ. 300-700
హైదరాబాద్: అక్రమార్కుల కారణంగా సామాన్యులకు మరో షాక్ తగిలింది. పెద్ద నోట్ల రద్దు, చిన్న నోట్ల కొరత నేపథ్యంలో వివిధ వస్తువుల ధరలు పెరిగాయని వదంతులు వ్యాపింప చేస్తున్నారు అక్రమార్కులు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఉప్పు ధర పెరుగుతుందని పుకార్లు... ఫలితంగా షాపుల వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా జనం కిరాణాషాపుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉప్పు కొరత కారణంగా రేపటి నుంచి కిలో ఉప్పు ధర రూ.400 రూపాయలకు చేరుతుందని పుకార్లు రావడంతో ఒక్కొక్కరు 4 నుంచి 10 కిలోల ఉప్పు ప్యాకెట్లు కొనుగోలు చేశారు.
ఇదే అదనుగా భావించిన కిరాణా వ్యాపారులు కూడా సామాన్యులను దోపిడీ చేస్తున్నారు. బోరబండలో శుక్రవారం రాత్రి నుంచి ఉప్పు కిలోకు రూ. 300లకు అమ్మినట్లు తెలుస్తోంది. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రూ. 200 నుంచి 300 వరకు అమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఉప్పుతోపాటు చక్కెరను కూడా కిలోకు రూ. 300 నుంచి 700 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
కాగా, ఉప్పు ధర పెరిగినట్లు వస్తున్న వందుతలను నమ్మవద్దని సీపీ మహేందర్రెడ్డి తెలిపారు. ఇదే అదునుగా వ్యాపారులు ఉప్పు విక్రయాలు నిలిపివేసి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ ఫిసియొద్దీన్ కూడా వినియోగదారులకు భరోసా ఇచ్చేందుకు నగరంలోని పలు దుకాణాలను తనిఖీ చేశారు. ఎవరైనా ఎమ్మార్పీ ఖంటే ఎక్కువ నిత్యావసర సరుకులను అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఢిల్లీ, ముంబైల్లో రూ. 400, 700లకు కేజీ ఉప్పు
చిన్న నోట్ల కొరత నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా ఉప్పు ధరకు రెక్కలొచ్చాయి. కిలో ఉప్పు రూ.200లకు విక్రయిస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి. మొరాదాబాద్లో 3 కిలోల ఉప్పుకు పలు దుకాణాల్లో రూ.500 అడిగినట్లు చెబుతున్నారు.
ఢిల్లీలో తాను రూ.55 చెల్లించి కిలో ఉప్పు కొన్నట్లు టెలికం ఉద్యోగి అభిషేక్ రాయ్ తెలిపారు. శనివారం నుంచి కిలో ఉప్పు రూ.300కు చేరుకుంటుందని కిరాణా దుకాణదారులు బెదిరించినట్లు అలహాబాద్కు చెందిన జైనాబ్ జాఫర్ అనే మహిళ తెలిపారు. కాగా, ముంబైలో అయితే ఏకంగా, రూ. 700 కిలో చొప్పున ఉప్పును అమ్మేస్తున్నట్లు సమాచారం.
ఉప్పు కొరత లేదు: కేంద్రమంత్రి
ఉప్పు కొరత వార్తలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిలో ఉప్పు రూ.14 నుంచి 15 రూపాయలకు మించలేదని మంత్రి స్పష్టం చేశారు.