గులాబీ నేతల్లో గుబులు..! పోలింగ్ అంచనా అందక కలవరపడుతున్న నేతలు..!!
హైదరాబాద్ : పదహారు సీట్లు మావేనంటూ ఊదరగొడుతున్న గులాబీ శ్రేణులు పోలింగ్ అంచనాలు అందక తలలు పట్టుకుంటున్నాయి. ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో మెజార్టీ తగ్గితే గులాబీ బాస్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు భయపడుతున్నారు. నిజంగానే 2018 ముందస్తు ఎన్నికలతో పోల్సితే.. 2019 లోక్ సభ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకు కీలకమైనవి. తెలంగాణ గడ్డపై తిరుగులేని నేతగా ఎదిగిన చంద్రశేఖర్ రావు ఇకమీదట జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే లోక్ సభలో 16 మంది ఎంపీలు ఉండాల్సిందే. అందుకోసమే టీఆర్ఎస్ ఈ ఎన్నికలను అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో తగ్గిన పోలింగ్..! ఓటేయడానికి విముఖత చూపిన జనం..!!
ఫెడరల్ ఫ్రంట్ పేరిట చంద్రశేఖర్ రావు హడావుడి చేసినా ఇప్పటికీ అది పట్టాలెక్కలేదు. తరచూ చంద్రశేఖర్ రావు బహిరంగసభల్లో తాను ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నానంటూ చెప్పటం కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఎందుకంటే. ఒకవేళ సీట్లు తగ్గితే బాస్ మాటలు నేతి బీర చందం అనే విమర్శలు ఎదుర్కోవాల్సివస్తుంది. మరోవైపు కాంగ్రెస్, భాజపా కూడా ఎదురుదాడికి దిగుతాయి. చంద్రశేఖర్ రావు పై ప్రజల్లో వ్యతిరేకతకు తగ్గిన సీట్లను బూచిగా చూపుతారు. ప్రజల్లోనూ గులాబీ పార్టీ పట్ల వ్యతిరేక భావన పెరిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే దీర్ఘకాలం పార్టీ కొనసాగటం.. నేతలను కాపాడుకోవటం కూడా గులాబీపార్టీకి సవాల్ గానే మారుతుంది. ఇప్పటికే హరీష్ రావును దూరం చేసుకున్న చంద్రశేఖర్ రావు ప్రత్యర్థులకు చేతులారా అవకాశం ఇచ్చారనే అపవాదును మూటకట్టుకున్నట్ఠైందనే చర్చ జరుగుతోంది.

గులాబీ దళంలో కలవరం..! తగ్గిన పోలింగ్ వల్ల ఎవరికి నష్టం..!!
భవిష్యత్తులో హరీష్ రావు ఎదురు తిరిగితే చంద్రశేఖర్ రావు అనుభవం దాన్ని నిలువరించగలదా అనే సందేహం కూడా లేకపోలేదు. ఇటువంటి సమయంలో గత ఎన్నికలతో పోల్చితే లోక్ సభ ఎన్నికలకు జనం అంతగా మొగ్గుచూపలేదు. పైగా పోలింగ్ కేంద్రాలకు రాలేదు. మరోవైపు ఏపీలో ఓటేసేందుకు సీమాంధ్రులు వెళ్లిపోయారు. ఫలితంగా కేవలం 62శాతం వద్దనే ఆగిపోవాల్సి వచ్చింది. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత అనే భావన నెలకొంది. ఇప్పటికే 17 తెలంగాణ లోక్ సభ స్థానలలో ఒకటి ఎంఐఎం ఖాతాలో పడిపోయినట్లుగానే అంచనా వేసుకోవచ్చు. మిగిలిన 16 స్థానాల్లో మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, నల్లగొండ, మహబూబాబాద్, నిజామాబాద్, ఖమ్మం చోట్ల కారుకు ఎదురుగాలి తప్పలేదని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ నేతల్లో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది.

ముందస్తుకు, లోక్ సభ ఎన్నికలకు తేడా..! కేసీఆర్ సభలకు రాని జనం..!!
ఈ ఆరింట్లో బాజపా, కాంగ్రెస్ చెరో రెండు తప్పకుండా గెలుచుకుంటాయంటూ ఆయా పార్టీలు లెక్కలు కడుతున్నాయి. చంద్రశేఖర్ రావు కూతురు బరిలో ఉన్న నిజామాబాద్ లో రైతుల వ్యతిరేకత కారణంగా 175 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసి పోటీకు దిగారు. గతంలో ఖమ్మంలోనూ రైతులను రౌడీలుగా చిత్రీకరించిన తుమ్మలను ఓడించారు. ఇప్పుడు అదే తుమ్మల చిరకాల ప్రత్యర్ధి నామా నాగేశ్వరావు గెలుపుకోసం నానాతంటాలు పడుతున్నారు. నామా గెలిస్తే తుమ్మలకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం కూడా లేకపోలేదు. నల్లగొండలోనూ కాంగ్రెస్ కూటమి గట్టిగానే పనిచేసింది. ఏపీలో బాబుపై నిప్పులు చెరుగుతున్న చంద్రశేఖర్ రావు కు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో తెలంగాణలోని తెలుగుదేశం శ్రేణులు కూడా కాంగ్రెస్ కు అండగా నిలిచాయని సమాచారం.

ప్రజల నాడి పట్టుకోవడంలో టీఆర్ఎస్ విఫలం..! హరీష్ ప్రభావం కూడా ఉండే అవకాశం..!!
సికింద్రబాద్ లో హిందువుల ఓట్లు అధికశాతం కిషన్ రెడ్డి కి పోలైనట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో హిందువులకు వ్యతిరేకంగా.. ఎంఐఎం నేత అససుద్దీన్ కోసం చంద్రశేఖర్ రావు చేసిన కొన్ని వ్యాఖ్యలు దీనికి కారణమని తెలుస్తోంది. ఇలా గులాబీ పార్టీ అధినేత నియంత పోకడలు.. అన్నీ తానై చక్రం తిప్పిన కేటీఆర్ తీరుపై పెల్లుబుకిన వ్యతిరేకత.. హరీష్ రావును పక్కనబెట్టారనే ప్రతికూల భావన ప్రజల్లోకి వెళ్లటం వంటి పలు అంశాలు, గులాబీ పార్టీ సీట్లకు గండి కొడుతున్నట్లు సమాచారం. ఇందుకు నిదర్శనమే తగ్గిన పోలింగ్ శాతమంటూ విపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. కానీ.. గులాబీ పార్టీ మాత్రం మాత్రం తమ కు 16 సీట్లు పక్కాగా వస్తాయని ధీమాతో ఉంది. ఎవరు ఎంతవరకు కరెకంటో తెలియాలంటే మే 23వరకూ వేచి చూడాల్సిందే..!












Click it and Unblock the Notifications